అమరావతి: రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) ఇచ్చిన నివేదికలపై చర్చించేందుకు సోమవారం జరగాల్సిన హైపవర్ కమిటీ భేటీ వాయిదా పడింది. కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడతో ఈ భేటీని మంగళవారానికి వాయిదా వేశారు. దీంతో హైపవర్ కమిటీ తొలి సమావేశం జనవరి 7న జరగనుంది. సచివాలయం లేదా సీఆర్డీఏ కార్యాలయంలో హైపవర్ కమిటీ భేటీ అయ్యే అవకాశం ఉంది. అమరావతి గ్రామాల్లో నెలకొన్న ఆందోళనల కారణంగా సచివాలయం కంటే సీఆర్డీఏ కార్యాలయంలో సమావేశం నిర్వహణ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై మరింత అధ్యయనం చేసేందుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓ హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజధాని అంశం మీద రాజకీయంగా రగడ కొనసాగుతోంది. అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ సమస్యకు ముగింపు పలకాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మూడు రాజధానుల ప్రతిపాదనల పైన ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ..బోస్టన్ కమిటీ రెండూ ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాయి. ఆ రెండు నివేదికల్లోనూ విశాఖను పరిపాలనా రాజధానిగా సిఫార్సు చేసారు. ఇప్పుడు ఈ రెండు కమిటీ నివేదికలపైనా అధ్యయనం కోసం పది మంది మంత్రులు.. అధికారులతో కలిపి ప్రభుత్వం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీకి కన్వీనర్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీకి ఈ నెల 17వ తేదీ నాటికి నివేదిక ఇవ్వాలని నిర్ధేశించినట్లుగా తెలుస్తోంది. ఆ తరువాత ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వ హించి..మూడు రాజధానుల ప్రతిపాదనలకు అధికారికంగా ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగా ఏపీ రాజధానిపై అధికారిక ప్రకటన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మూడు రాజధానులపై అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.