తుళ్లూరు: రాజధాని అమరావతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం విజయవాడ కనక దుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు తుళ్లూరు, మందడంతో పాటు రాజధాని గ్రామాల మహిళలు, రైతులు ర్యాలీగా బయల్దేరగా.. మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. ముళ్ల కంచెలు అడ్డు పెట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. రైతులను లాఠీలతో చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో పలువురు కిందపడిపోయారు. ఈ లాఠీచార్జ్లో పలువురు మహిళా రైతులకు గాయాలయ్యాయి.
తుళ్లూరు నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయానికి పాదయాత్రగా బయల్దేరిన మహిళలను.. ఆ గ్రామ శివారులో పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రలకు, ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని, పాదయాత్రను విరమించుకోవాలని మహిళలకు పోలీసులు చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అడ్డుకున్నా.. కొందరు రైతులు, మహిళలు ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. దీంతో పలువురు మహిళలు, రైతులకు స్వల్ప గాయాలయ్యాయి. శుక్రవారం అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లాలంటే.. ప్రభుత్వం అనుమతి కావాలా అంటూ మహిళలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము దైవ సన్నిధికి వెళుతున్నామని.. ప్రభుత్వంపై యుద్ధానికి కాదన్నారు. అమ్మవారికి మొక్కులు సమర్పించుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతికావాలా ? అని ప్రశ్నించారు. తాము వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కొందరు మహిళలు పోలీసుల కాళ్లపై పడ్డారు.
మరోవైపు మందడంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామ దేవత పోలేరమ్మకు నైవేద్యం పెట్టేందుకు వెళ్తుండగా.. గుడి సమీపంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. గుడి చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆలయంలోకి వెళ్లేందుకు ఎవర్నీ కూడా అనుమతించడం లేదు. దీంతో అక్కడి మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తొపులాట జరిగింది. అమ్మవారికి నైవేధ్యం పెట్టేందుకు పోలీసుల అనుమతి కావాలా అంటూ మహిళలు మండిపడ్డారు. అసలు ఏపీలో ఉన్నామా లేక పాకిస్తాన్లో ఉన్నామా ? అంటూ పోలీసులను ప్రశ్నించారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు
ఇదిలా ఉంటే.. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్, 30 యాక్టు అమల్లో ఉందని పోలీసులు మైక్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. మందడం గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసుల బలగాలు మోహరించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
#SaveAmaravatiFarmers #SaveAmaravati #Amaravathi lo enthamandhi police enduku!!?#Janasena #TDP #Ysrcp #FailedCMJagan pic.twitter.com/euGZ9NQ24f
— SURENDRA (@Surendrassv) January 10, 2020