బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టిన ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. గురువారం నగరంలోని టౌన్ హాల్ వద్ద రామచంద్ర గుహతోపాటు మరికొంత మంది ప్రదర్శనలో పాల్గొన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన తెలుపుతున్న అనేక మంది రచయితలు, సాహితీవేత్తలు, చరిత్రకారులను బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యాన్లలోకి ఎక్కించారు. అయితే, మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్న రామచంద్ర గుహను పోలీసులు బలవంతంగా ఈడ్చుకువెళ్లి పోలీస్ బస్సు ఎక్కించారు. ఈ ఘటన మీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
‘ శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తుంటే పోలీసులు అరెస్టు చేస్తున్నారు. వీరు కేంద్రప్రభుత్వం ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నారు. మేము వివక్షాపూరితమైన చర్యలకు వ్యతిరేకంగా అహింసాయుతంగా మా నిరసన తెలియజేస్తున్నాము. ఇక్కడ చూడండి, ప్రతిఒక్కరూ శాంతియుతంగా ఉన్నారు. మీకు ఇక్కడ ఏమైనా హింసాయుత వాతావరణం కనిపిస్తోందా ? ’ అని ఎన్డీటీవీతో మాట్లాడుతుండగా పోలీసులు ఆయన్ను లాక్కుపోయి ఒక బస్సులో ఎక్కించటం వీడియోలో కనిపిస్తోంది. అనంతరం ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. గాంధీజీ పోస్టర్ ను పట్టుకున్నందుకు, రాజ్యాంగం గురించి ప్రస్తావించినందుకు తనను అరెస్టు చేశారని రామచంద్ర గుహ పేర్కొన్నారు.
మరోవైపు బెంగళూరు నగరంలో ఆంక్షలు విధించడాన్ని సీఎం యడియూరప్ప సమర్థించారు. ఈ నిరసనల వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని ఆరోపించారు. ముస్లిముల రక్షణ, భద్రత తమ బాధ్యత అని, శాంతియుతంగా ఉండాలని అందరినీ కోరుతున్నామని అన్నారు. కాంగ్రెస్ నేతలు నిరసనకారులకు మద్దతునిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు.