అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు.. మెజారిటీ ప్రజల అభిమతానికి విరుద్ధంగా విభజన జరిగింది.. రెవిన్యూ తెచ్చిపెట్టే రాజధాని హైదరాబాద్ విభజన కోరుకున్న తెలంగాణకు వెళ్లింది. నవ్యాంధ్రకు తీరని నష్టం మిగిల్చారు. విభజన శాస్త్రీయంగా జరగలేదు..ఎక్కడో విన్నట్లు ఉంది ఈ మాటలు అనుకుంటున్నారా? అవును మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోట చాలాసార్లు ఈ మాటలు విన్నాం.
అయితే ఇప్పుడు తాజాగా ఈ మాటలు అన్నది చంద్రబాబు కాదు, నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఢిల్లీలో శనివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగంలో మాటలివి. అందరూ అనుకుంటున్నట్లు గానే, ఆయన స్వయంగా ముందే ప్రకటించినట్లుగానే ప్రత్యేక హోదా గురించి ముఖ్యమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేకహోదా ఎందుకు అవసరమో వివరించేందుకు గతం గురించి ఏకరవు పెట్టారు.
ఇవే మాటలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాను అధికారంలో ఉండగా అన్నపుడు, కోరుకుని విడిపోయిన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కెసిఆర్, ఆయన కుమారుడు కెటిఆర్, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు మరికొందరు తీవ్రంగా విమర్శించారు. విభజన అశాస్త్రీయంగా జరిగిందన్న మాట వారికి రుచించలేదు. విభజనకు అంగీకరించిన వారైనప్పటికీ నవ్యాంద్ర అన్యాయం జరిగేలా విభజన జరిగిందని చంద్రబాబు అనడం కూడా వారు భరించలేకపోయారు. చివరికి విభజన సమయంలో ప్రత్యేకహోదాకు మద్దతు ఇచ్చిన వారే తర్వాత మాట మార్చారు. నవ్యాంధ్రకు ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణ నష్టపోతుంది కాబట్టి దానిని తాము వ్యతిరేకిస్తామని టిఆర్ఎస్ నాయకులు అన్నారు.
టిఆర్ఎస్ నాయకత్వం కోరుకున్నట్లు గానే ఎన్నికలలో విజయం సాధించి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ప్రత్యేకహోదాకు కెసిఆర్ మద్దతు ప్రకటించారు. ఇద్దరు ముఖ్యమంత్రులూ చాలా సఖ్యతగా ఉంటున్నారు. ఇప్పుడు జగన్ కూడా నవ్యాంధ్రకు విభజన వల్ల అన్యాయం జరిగిందని అంటున్నారు. మరి కెసిఆర్ స్పందన్ ఎలా ఉంటుంది. గతంలో చంద్రబాబు మాటలకు స్పందించినట్లు గానే వ్యవహరిస్తారా? లేక స్నేహితుడని జగన్ను ఉపేక్షిస్తారా?