అమరావతి: రాజధాని తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతుల ఆందోళన కొనసాగతున్న వేళ సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రైతుల ఆందోళన, విపక్షాల అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కాన్వాయ్ అసెంబ్లీకి చేరుకునే మార్గంలో గట్టి భద్రత ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం నివాసం నుంచి సచివాలయం వరకు అడుగడుగునా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీకి వేళ్లే మార్గంలో ఇప్పటికే సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు.
మరోవైపు రాజధాని ప్రాంతంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు అధికారులు స్పష్టం చేశారు. జనవరి 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అమరావతి పొలిటికల్ జేఏసీ, ప్రజా సంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో మందడం, తుళ్లూరు గ్రామాలకు చెందిన రైతులు, స్థానికులకు పోలీసు నోటీసులు కూడా జారీ చేశారు. సెక్షన్ 149 సీఆర్పీసీ ప్రకారం ఈ నోటీసులు పంపించారు. జైల్ భరో, గుంటూరు కలెక్టరేట్ ముట్టడి అంటూ పత్రికల్లో వచ్చిన ప్రకటనల ఆధారంగా నోటీసులు ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆందోళనల కారణంగా రహదారిపై వాహనాలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడే అవకాశముందని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం జరిగే ప్రమాదముందని పోలీసులు తెలిపారు. గొడవలు జరిగితే ప్రాణనష్టానికి దారి తీయవచ్చని నోటీసుల్లో పేర్కొన్నారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా నిరసనలు చేపట్టాలని రాజధాని ప్రాంత గ్రామస్థులకు పోలీసులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.