(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణలో ర్యాలీలపై రాజకీయ రగడ చెలరేగుతోంది. శనివారం హైదరాబాద్ లో ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పోలీసుల అనుమతి కోరాయి. అయితే, శాంతి భద్రతల సమస్యలను సాకుగా చూపిన నగర పోలీసులు రెండు పార్టీల అభ్యర్థనలను తిరస్కరించారు. అయితే, టీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీకి ఇటీవలే హైదరాబాద్ లో నిర్వహించిన సభకు అనుమతి ఇచ్చిన పోలీసులు.. తమ ర్యాలీలకు అనుమతి ఇవ్వకపోడంపై ఇరు పార్టీలకు చెందిన నాయకులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా రగులుతున్న సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ‘సేవ్ నేషన్ – సేవ్ కాన్స్టిట్యూషన్’ నినాదంతో హైదరాబాద్ లో భారీ ర్యాలీకి నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావించారు. గాంధీభవన్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ర్యాలీకి అనుమతి ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీసులను కోరారు. అదే సమయంలో ఇందిరాపార్క్ వద్ద ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో సీఏఏ అనుకూల సభకు అనుమతి కావాలని బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా పోలీసులను కోరారు. ఈ నేపథ్యంలో పోటాపోటీగా సభలను నిర్వహించేందుకు సిద్దమైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలకు నగర పోలీసులు షాకిచ్చారు. ఇద్దరి అభ్యర్థనలను తిరస్కరించారు. దీంతో ఇరు పార్టీలకు చెందిన నాయకులు పోలీసుల తీరుపై భగ్గుమన్నారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఎంఐఎం పార్టీ సభకు అనుమతి ఇచ్చి.. తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. శనివారం(డిసెంబర్ 28) కాకపోతే డిసెంబర్ 30న ఇందిరాపార్క్ వద్ద సీఏఏ అనుకూల సభ నిర్వహిస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ చర్యను సమర్థిస్తూ సభ నిర్వహిస్తే దాన్ని పోలీసులు అడ్డుకోవడమేంటని ఆయన ప్రశ్నించారు. పోలీసులు అనుమతించకపోయినా సభను నిర్వహించి తీరతామని స్పష్టం చేశారు.
మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణ పోలీసుల వైఖరిపై మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ భారీ ర్యాలీకి అనుమతించిన పోలీసులు.. తమకెందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కర్రలతో నగరంలో భయోత్పాతాన్ని సృష్టించారని ఉత్తమ్ ఆరోపించారు. రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడిన మోహన్ భగవత్ సభకు ఎలా అనుమతిచ్చారు ? తిరంగా యాత్ర చేస్తామంటే తమకు ఎందుకు అనుమతివ్వరు ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు కల్వకుంట్ల పోలీస్ సర్వీస్ అమలవుతోందని ఉత్తమ్ ఘాటు విమర్శలు చేశారు.