హైదరాబాద్: గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై రాకపోకలు శనివారం పునఃప్రారంభమయ్యాయి. నవంబర్ 23వ తేదీ రోజు జరిగిన కారు ప్రమాదం తర్వాత ఫ్లై ఓవర్ను అప్పట్లో అధికారులు మూసివేశారు. ప్రారంభమైన కొద్ది రోజులకే రెండు వరుస ప్రమాదాలతో తాత్కాలికంగా మూతపడ్డ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్.. 43 రోజుల తర్వాత అందుబాటులోకి వచ్చింది. శనివారం మేయర్ బొంతు రామ్మోహన్, సైబరాబాద్ సీపీ సజ్జనార్, ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు కలిసి వంతెనను పరిశీలించారు. అనంతరం వాహనాలను అనుమతించారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై 1200కు పైగా రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు. ప్రతి 50 మీటర్లకు వైట్ పెయింట్తో కూడిన రంబుల్ స్ర్టిప్స్ అమర్చారు. వేగ పరిమితి 40 కిలోమీటర్లకు మించొద్దని సూచిస్తూ వంతెనకు రెండు వైపులా బోర్డులు ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై కీలక ప్రాంతంలోని ఓ మలుపు వద్ద వ్యూ కట్టర్లను ఏర్పాటు చేశారు. నిర్దేశిత వేగం కన్నా ఫ్లై ఓవర్పై వేగంగా వెళ్లే వారిని గుర్తించి జరిమానా విధించేందుకు సీసీటీవీ కెమెరాలు కూడా అమర్చారు. వాహనం 40 కిలోమీటర్లు వేగం దాటిన వెంటనే ఆటోమేటిక్గా వారికి జరిమానాలకు సంబంధించి మెసేజ్ వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. ఫ్లైఓవర్పై 40 స్పీడ్ దాటితే భారీ జరిమానా ఉండాలని కమిటీ సూచించింది. ట్రాఫిక్ నిబంధనలు తెలియజేసే సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక మెటీరియల్తో ఫ్లైఓవర్పై స్పీడ్ లిమిట్ 40 కిలో మీటర్లు అని తెలిసేలా రంబుల్ స్ట్రిప్స్ వేశారు.
మరోవైపు వంతెన నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవని కమిటీ తేల్చిందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. కారు ప్రమాదం జరిగిన తర్వాత 43 రోజుల పాటు ఫ్లై ఓవర్ ను మూసేశామని చెప్పారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇక్కడ మంచి వాతావరణం ఉండడంతో కొందరు సెల్ఫీలు దిగుతున్నారని, సెల్ఫీలు దిగకుండా సైడ్ వాల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. సెల్పీలు దిగితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అంతేకాదు సీసీ కెమెరాలు, స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశామని మేయర్ తెలిపారు.
రూ.69.47 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ను గతేడాది నవంబర్ 4న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. వారం రోజులు తిరగక ముందే నవంబర్ 10న అర్ధరాత్రి బ్రిడ్జిపై సెల్ఫీ తీసుకుంటున్న ఇద్దరు యువకులను ఓ కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ప్రవీణ్ (22), సాయి వంశీ రాజు(22) ఫ్లై ఓవర్పై నుంచి కిందపడి అక్కడిక్కడే మృతి చెందారు. మళ్లీ నవంబర్ 23న ఫ్లై ఓవర్పై మరో ఘోర ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా వస్తున్న ఓ ఫోక్స్ వ్యాగన్ పోలో కారు.. అదుపు తప్పి కింద ఉన్న రోడ్డపై పడింది. ఈక్రమంలో కింది రోడ్డుపై బస్సు కోసం వేచి చూస్తున్న మహిళపై కారు పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మరో నలుగురు గాయపడ్డారు. ఇలా వరుసగా కొద్ది రోజుల వ్యవధిలోనే ప్రమాదాలు జరగడంతో వంతెన నిర్మాణ శైలిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. బ్రిడ్జి డిజైన్లో లోపముందని, భూసేకరణలో రాజీపడడం వల్ల ఈ సమస్య తలెత్తిందనే ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో నలుగురితో కూడిన నిపుణుల కమిటీ పరిశీలించి.. కొన్ని సూచనలు చేసింది. మరమ్మత్తుల అనంతరం ఫ్లైఓవర్పై భద్రతా ప్రమాణాలను పరిశీలించిన కమిటీ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఫ్లైఓవర్ను మళ్లీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు.