(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
జాతిని ఏకీకృతం చేయాలంటే హిందిని అందరూ దేశభాషగా స్వీకరించాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్షా మాటలకు హిందీయేతర రాష్ట్రాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో షా మెట్టుదిగారు. ప్రాంతీయ భాషలకు ఇతోధిక ప్రాధాన్యం ఇస్తామనీ, ఎట్టిపరిస్థితుల్లోనూ హిందీని బలవంతంగా రుద్దబోమనీ షా స్పష్టం చేశారు. బుధవారం రాంచీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు.
దక్షిణాదిన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మినహా అన్ని రాష్ట్రాల నేతలు హిందిభాషపై షా వ్యాఖ్యలను తప్పుబట్టారు. బిజెపి పాలిత రాష్ట్రం కర్నాటక నుండి కూడా వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. హిందీ కుదరదు, రాష్ట్రంలో కన్నడ భాష వాడకం ఇంకా ఎక్కువ చేస్తామని కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అన్నారు. హిందీకి వ్యతిరేకంగా తమ రాష్ట్రంలోనే కాదు పార్లమెంట్లోనూ గొడవ చేస్తామని డిఎంకె నేత స్టాలిన్ హెచ్చరించారు. హిందీ సినిమాల్లో నటిస్తున్నంత మాత్రాన తమ రాష్ట్రంలో హిందీని నెత్తిన పెట్టుకోము, తమిళం కోసం ఉద్యమిస్తామని పేర్కొన్నారు రాజకీయ నేతగా మారిన ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్. భాషపేరుతో మరో యుద్ధానికి సన్నద్దం అవుతుందా సంఘ్ పరివార్ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మండిపడ్డారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా హిందీని చస్తే మా మీద రుద్దలేరు, వ్యతిరేకిస్తాం అంటూ పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామితో గొంతు కలిపారు. మరో మాజీ ముఖ్యమంత్రి సిద్ద రామయ్య కూడా అమిత్ షా వ్యాఖ్యలను ఖండించారు. ఈశాన్య ప్రాంతంలోని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా షా వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు.
దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవరంతంగా రుద్దే ప్రయత్నం చేయవద్దని సూపర్ స్టార్ రజనీకాంత్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దేశాభివృద్ధికి ఒకే భాష మంచిదే కానీ దురదృష్టవశాత్తు భారత్లో అది సాధ్యపడదు అని రజనీకాంత్ వ్యాఖ్యానించారు.
మాతృభాషపై తెలుగురాష్ట్రాల్లో నేతలకు మమకారం లేకపోయినా మిగిలిన హిందీయేతర రాష్ట్రాల నుండి నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన నేపథ్యంలో షా మెట్టు దిగకతప్పలేదు.