భారత వాయుసేనకు చెందిన ఎమ్ఐ17 హెలీకాప్టర్ (ఫైల్ ఫొటో)
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అనుమానమే నిజమయింది. ఫిబ్రవరి 27న జమ్ము కశ్మీర్లో కూలిపోయిన భారత వాయుసేన ఎమ్ఐ17 హెలీకాప్టర్ ప్రమాదానికి గురి కాలేదు. భారత వాయుసేన ప్రయోగించిన సర్ఫేస్ టు ఎయిర్ స్పైడర్ క్షిపణి దానిని కూల్చివేసిందని విచారణలో తేలినట్లు ఎన్డిటివి పేర్కొన్నది.ఈ సంఘటనలో హెలీకాప్టర్లోని ఆరుగురు సిబ్బంది, అది కూలిపోయినపుడు అక్కడున్నఒక పౌరుడు మరణించారు.
ఎన్డిటివి కథనం ప్రకారం ఎమ్ఐ17 హెలీకాప్టర్ పతనంపై ఎయిర్ఫోర్స్ ఆదేశించిన విచారణ మరో 20 రోజుల్లో పూర్తవుతుంది. ఆ తత్వాత మొత్తం సేకరించిన సాక్ష్యాధారాలను ఉన్నతాధికారులకు సమర్పిస్తారు. హెలీకాప్టర్ కూల్చివేతకూ, సిబ్బంది మరణానికీ కారకులైన వారిపై కల్పబుల్ హోమిసైడ్ (హత్యానేరం కిందకు రాని హత్య) కింద అభియోగాలు నమోదు చేస్తారు.
ఎయిర్ఫోర్స్ వర్గాల సమాచారం ప్రకారం స్పైడర్ మిస్సైల్ ప్రయోగించిన దానికీ, ఆ క్షిపణి వెళ్లి లక్ష్యాన్ని బేధించిన దానికీ మధ్య 12 సెకన్ల వ్యవధి ఉంటుంది. ఫిబ్రవరి 27న ఇండియా, పాకిస్తాన్ మధ్య తీవ్ర సైనిక ఉద్రిక్తత నెలకొన్నవిషయం తెలిసిందే. బాలాకోట్ దాడికి ప్రతిగా పాకిస్తాన్ యుద్ధ విమానాలు ఆరోజు ఉదయం భారత భూభాగంపై దాడికి దిగాయి. పాకిస్తాన్ యుద్ధవిమానాన్ని వాయుసేన పైలట్ అభినందన్ వర్ధమాన్ కూల్చివేసింది అప్పుడే.
పశ్చిమ గగనతలం అంతా గంగరగోళంగా ఉన్న ఆరోజు ఉదయాన శ్రీనగర్ విమానాశ్రయంలోని డిఫెన్స్ రాడార్ బాగా కిందుగా ఎగురుతున్న ఒక ఎయిర్క్రాఫ్ట్ను పసిగట్టింది. మరి ఏమయిందో, ఎలా పొరపాటు పడ్డారో గానీ దాని పైకి మిసైల్ ప్రయోగించాల్సిందిగా ఆర్డర్ జారీ అయింది. తమ హెలీకాప్టర్పైకి స్పైడర్ క్షిపణి దూసుకువస్తోందని ఎమ్ఐ17 సిబ్బిందికి తెలిసే అవకాశం కూడా లేదు. 12 సెకన్లలో క్షిపణి దానిని కూల్చివేసింది.