(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
యువ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయానంటూ తన వృత్తికి రాజీనామా చేశారు. దాద్రా నగర్ హవేలీలో పవర్ అగ్రికల్చర్, పట్టణాభివృద్ధి కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న గోపీనాథ్.. తనను రిలీవ్ చేయాల్సిందిగా హోం శాఖ సెక్రెటరీకి ఈ నెల 21న లేఖ రాశారు. తనకు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ముఖ్యమని, గొంతు లేని వాళ్ల తరపున గొంతు వినిపించగలనని నమ్మి సర్వీసులో చేరానని, కానీ ఇప్పుడు తన సొంత గొంతును కూడా విప్పలేకపోతున్నానని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామా ఎలాంటి ప్రభావం చూపబోదని తనకు తెలుసునన్నారు. అయితే ఇటీవల జమ్మూకశ్మీర్ కు ప్రత్యేకప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు సమయంలో తన ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తం చేయలేకపోయానని గోపీనాథన్ ఆ లేఖలో తెలిపినట్లు తెలుస్తోంది.
గత ఏడాది కేరళలో సంభవించిన భారీ వర్షాలు, వరదల్లో దాద్రా నగర్ హవేలీ కలెక్టర్గా గోపినాథ్ విధులు నిర్వహిస్తూ.. ఓ సామాన్యుడిలా వరద సహాయక పనుల్లో మూటలు మోసి వార్తల్లో నిలిచారు. బాధితులకు సహాయం చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న మరో అధికారి ఈయనను గుర్తించే వరకు ఎవ్వరికీ ఆయన కలెక్టర్ అనే విషయమే తెలియలేదు. దీంతో ఆయన సేవాభావాన్ని చూసి అక్కడున్న వారితో పాటు దేశం మొత్తం ఆయనను ప్రశంసించారు. స్వతంత్రభావాలు, సమాజంపై వ్యక్తిగత అభిప్రాయాలు, సేవాభావం కలిగిన ఈ యువ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం తీవ్ర సంఘర్షణకు లోనవుతున్నట్టు సమాచారం. అందువల్లే తనను రిలీవ్ చేయాలంటూ లేఖ రాసినట్లు తెలుస్తోంది.