న్యూఢిల్లీ: అయోధ్య కేసుపై ఈ నెల 25వ తేదీ నుంచి రోజువారీ విచారణ చేపడతామనీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమర్తి జస్టిస్ రంజన్ గొగోయ్తో కూడిన రాజ్యంగ ధర్మాసనం పేర్కొంది. ఈ నెల 18లోగా అప్పటి వరకూ ఉన్న వాస్తవ నివేదిక ఇవ్వాలనీ మధ్యవర్తిత్వ కమిటీని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది.
అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాదం సమస్య పరిష్కారంలో మధ్యవర్తిత్వంతో ఎలాంటి ప్రయోజనం కన్పించడం లేదంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
అయోధ్య వివాదంలో సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించడానికి ఈ ఏడాది మార్చి ఎనిమిదవ తేదీన సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎఫ్ఎం ఖలీవుల్లా, ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, ప్రముఖ న్యాయవాది శ్రీరామ్ పంచులు సభ్యులుగా సుప్రీం ధర్మాసనం మధ్యవర్తిత్వ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ ఇటీవల మధ్యంతర నివేదికను న్యాయస్థానానికి సమర్పించింది. అయితే అందరికీ ఆమోదయోగ్యమైన, సామరస్య పరిష్కారాన్ని కనుగొనేందుకు తమకు మరింత సమయం కావాలని మధ్యవర్తిత్వ కమిటీ కోర్టను కోరింది. దీంతో కమిటీకి ఆగస్టు 15వరకూ న్యాయస్థానం గడువు ఇచ్చింది.
మధ్యవర్తిత్వంతో సమస్యకు పరిష్కారం కనిపించడం లేదనీ కక్షిదారుల్లో ఒకరైన గోపాల్ సింగ్ విశారద్ తరఫు న్యాయవాది కెఎస్ పరాశరన్ బుధవారం విచారణ సందర్భంలో ధర్మాసనానికి విన్నవించారు. ధర్మాసనానికి అందిన ప్రాథమిక నివేదికలో ఏదైనా చిన్న ఫలితమైనా కనిపించిందా అని పరాశరన్ ప్రశ్నించారు. మధ్యవర్తిత్వ కమిటీకి ఆగస్టు 15 వరకూ గడువు ఇచ్చామనీ ప్రధాన న్యాయమూర్తి గొగొయ్ చెప్పారు. మధ్యవర్తిత్వ కమిటీ కొనసాగుతుండగానే కోర్టులో విచారణ కూడా కొనసాగించాలని పరాశరన్ కోరారు. దీనిపై వాదనలు విన్న రాజ్యంగ ధర్మాసనం మధ్యవర్తిత్వ కమిటీ వారంలోగా ఆయోధ్యపై వాస్తవ నివేదిక అందించాలని ఆదేశించింది. ఆ నివేదిక పరిశీలించి అదే రోజు తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొన్నది.
ఒక వేళ మధ్యవర్తిత్వ కమిటీ సామరస్య పరిష్కారం చూపించకపోతే ఈ నెల 25 నుండి రోజువారీ విచారణ చేపడతామనీ ధర్మాసనం స్పష్టం చేసింది.