(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఏపీలో రాజకీయ పరిణామాలు జోరుగా మారుతున్నాయి. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు బీజేపీలో చేరడం ఖాయమనే సంకేతాలు వస్తున్న వేళ… జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాషాయ పార్టీకి దూరం కానున్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే ప్రతిపక్ష పార్టీలు రాజకీయ పావులు కదుపుతున్నాయి. ఏపీలో గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీ మళ్లీ ప్రజలకు దగ్గరయ్యేందుకు జోరుగా ప్రయత్నిస్తుంటే… పైకి సైలెంట్గా ఉంటూ బీజేపీ… తెరవెనుక రాజకీయం చేస్తోంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరేయ్యాలని టార్గెట్గా పెట్టుకున్న బీజేపీ… ఏపీలో అందుకు ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ క్యలాణ్ ను దగ్గరకు తీసుకోవాలని భావించారు.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన పవన్.. అనంతరం సైలెంట్ అయ్యారు. ఎన్నికల సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేశారని మోదీ, బీజేపీ ప్రభుత్వంపై పవన్ విమర్శించారు. అయితే, ఇటీవల జనసేనాని హఠాత్తుగా ఢిల్లీకి పర్యటనకు వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది. ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్న పవన్.. తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడిని సీరియస్గా తీసుకున్నారు. అమరావతి వంటి అంశాలతో పాటు ఏపీలో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ జరుగుతున్న రాజకీయంపై అవసరమైతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని ఇప్పటికే పవన్ ప్రకటించారు. ఢిల్లీ పర్యటన అనంతరం మోదీ, అమిత్ షా లాంటి వారే ఈ దేశానికి కరెక్ట్ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో మోదీ, అమిత్ షాలపై తీవ్ర విమర్శలు చేసిన పవన్.. సడెన్ గా వారిని పొగడటం, మద్దతివ్వడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో పవన్ తన జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారేమో అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి.
2014 ఎన్నికలకు ముందు అహ్మదాబాద్ వెళ్లి మోదీతో పవన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారాలు, ఇతర సందర్భాల్లో తప్ప ప్రత్యేకంగా భేటీ జరుగలేదు. అయితే మోదీపై తనకు ఎంతో అభిమానం ఉందని, మోదీ కూడా తనపై ఎంతో అభిమానం చూపిస్తారని పవన్ కొన్ని సందర్భాల్లో చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కూడా కాలేదు. ఇంతలోనే ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా విమర్శల దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన దూకుడుగా ఉన్నాయి. టీడీపీ గత వైభవం కోసం పోరాడుతుంటే… జనసేన వెనక ఢిల్లీ పెద్దల వ్యూహం ఉందని ప్రచారం కూడా సాగింది. ప్రధానంగా పవన్ కల్యాణ్… జగన్ ప్రభుత్వ విధానాలపై ఓ రేంజ్లో ఫైర్ అవ్వడానికి బీజేపీ రాజకీయ వ్యూహం ఉందని సమాచారం. ఏపీలో టీడీపీ, వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది. జనసేనను బీజేపీలో విలీనం చేయాలని అమిత్ షా కోరారని గతంలోనే పలు సందర్భాల్లో పవన్ చెప్పారు. బీజేపీతో పొత్తు దిశగా అమెరికాలో జరిగిన తానా సభల వేదికగా చర్చలు జరిగాయని, బీజేపీ సీనియర్ నేత రాం మాధవ్ నేరుగా పవన్ తోనే చర్చించారని, అయితే, అందుకు పవన్ ససేమిరా అన్నారని వార్తలు వినిపించాయి.
ప్రస్తుతం ఏపీలో బీజేపీకి పెద్దగా బలం లేదు. టీడీపీ నుంచి పలువురిని పార్టీలో చేర్చుకున్నప్పటికీ టీడీపీ, జనసేన స్థాయిలో ప్రభుత్వంపై దాడి చేయడం లేదు. ఏపీలో టీడీపీతో జతకట్టే పరిస్థితి కమలదళానికి లేదు. ఇలాంటి సమయంలో బీజేపీ అగ్రనేతల కళ్లు పవన్ కల్యాణ్పై పడినట్లు తెలిసింది. 2024 ఎన్నికల నాటికి పవన్ కల్యాణ్ని కలుపుకొని… ఏపీలో శక్తిమంతమైన పార్టీగా లేదా కూటమిగా మారాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. అయితే, తాజాగా వైసీపీ నేత మోహన్ బాబు ప్రధాని మోదీతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఏపీలో బీజేపీకి సినీ గ్లామర్ చాలా అవసరం. జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసుకుంటే పవన్ ఇమేజ్ తమకు కలిసి వస్తుందని బీజేపీ అగ్ర నేతలు భావించారు. అయితే, పవన్ నుంచి ఈ అంశంపై స్పష్టత లేకపోవడంతో బీజేపీ పెద్దలు మంచు ఫ్యామిలీని పార్టీలో చేర్చుకోవాలని డిసైడ్ అయ్యారనే తెలుస్తోంది.
నిజానికి మెగా ఫ్యామిలీకి… మోహన్ బాబుకు మధ్య విబేధాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. పైకి మామూలుగా ఉన్నా వారిమధ్య విబేధాలు ఉన్నాయన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. రాజకీయంగా, వ్యక్తిగతంగా మోహన్ బాబుతో వైరం ఉన్న పవన్.. ఆయన బీజేపీలో చేరితే.. పవన్ కాషాయ పార్టీ ఎలా దగ్గర అవుతారనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. మోహన్ బాబు అంటేనే గుర్రుగా ఉండే పవన్.. నెక్ట్స్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.