ప్రగ్యా ఠాకుర్ పై మండిపడ్డ స్వరా భాస్కర్
భోపాల్: ఉగ్రవాదం అనేది ఉగ్రవాదమేనని, దానికి మతం లేదని బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ అన్నారు. అయితే ఉగ్రవాదికి మాత్రం మతం ఉంటుందని, అందువల్ల ముస్లిం ఉగ్రవాదం ఉంటే హిందూ ఉగ్రవాదం కూడా ఉండి తీరుతుందని చెప్పారు. తన రాజకీయ అభిప్రాయాలను ఏమాత్రం దాచుకోని ఆమె.. భోపాల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాలెగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు ప్రగ్యాసింగ్ ఠాకుర్ నామినేషన్ దాఖలు చేయడం సిగ్గుచేటన్నారు. భోపాల్ లో మెరుగైన అభ్యర్థి ఎవరని తనను అడిగితే అనుమానం లేకుండా దిగ్విజయ సింగ్ పేరే చెబుతానని ఆమె అన్నారు. తాను హిందువునని, ఉగ్రవాదం కేసులో నిందితురాలినని ప్రగ్యా ఠాకుర్ చెబితే, ఆమె హిందూ ఉగ్రవాద నిందితురాలేనని చెప్పారు.
ఇస్లామిక్ ఉగ్రవాదం అన్న పదాన్ని కొంతమంది ఉపయోగిస్తే, హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని కూడా వాడచ్చని స్వరాభాస్కర్ తెలిపారు. హింస, నేరం, ఉగ్రవాదం అనేవి పాపాలని, ఏ మాతం వాళ్లయినా వాటిని చేస్తారని ఆమె అన్నారు. హిందువులు ఈ పాపం చేయచ్చని, ముస్లింలు కూడా చేయచ్చు, గతంలో చేశారని.. క్రిస్టియన్లు చేయచ్చు, వాళ్లు కూడా గతంలో చేశారని తెలిపారు. బౌద్ధులు, యూదులు కూడా గతంలో ఇలాంటివి చేశారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తాను చదివానని, అది బాగుందని అన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించింది కాబట్టి అది ప్రశంసనీయమన్నారు.
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థిని అయిన స్వరాభాస్కర్ గత నెలలో విద్యార్థి నాయకుడు కన్నయ్యకుమార్ తరఫున బిహార్ లోని బెగుసరాయ్ జిల్లాలో ప్రచారం చేశారు. కన్నయ్య తన స్నేహితుడని, అతడు తామందరి తరఫున ముఖ్యమైన పోరాటం చేస్తున్నాడని చెప్పారు. అతడు గెలిస్తే అది భారత ప్రజాస్వామ్య విజయమన్నారు.