న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా సహ వ్యవస్థాపకురాలు ఇంద్రాణీ ముఖర్జీని ఆర్థిక మంత్రి హోదాలో పి. చిదంబరం ఎప్పుడూ కలవలేదని ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా చిదంబరం తరఫున కపిల్ సిబల్, సీబీఐ తరఫున తుషార్ మెహతా ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జీని చిదంబరం కలిశారు అనడానికి సాక్ష్యాలు లేవని కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఎంతో మంది ఆయనను కలిసేవారని.. అయితే వారిలో ఇంద్రాణీ ఉన్నారో లేరోనన్న విషయం ఆయనకు గుర్తులేదని కపిల్ సిబల్ పేర్కొన్నారు.
మరోవైపు ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు మాయమయ్యాయని అడిషనల్ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హైకోర్టుకు తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన చిదంబంర ఆధారాలన్నింటినీ మాయం చేశారని ఆరోపించారు. ఇంద్రాణీ ముఖర్జీని జైలులో చిదంబరం కలిశారని, ఆ సమయంలో జైలు రిజిస్టర్లో చిదంబరం సంతకం చేశారని తుషార్ మెహతా పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆ రిజిస్టర్ కనిపించడం లేదని తెలిపారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జీ అప్రూవర్గా మారిన సంగతి తెలిసిందే. తాను చిదంబరాన్ని కలిశానని, ఈ మేరకు ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నానని ఆమె మెజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం ఇచ్చారని సీబీఐ ఇదివరకే కోర్టుకు వెల్లడించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో విచారణ ఎదుర్కొంటున్న చిదంబరంను సీబీఐ ఆగస్టు 21న అరెస్టు చేసింది. అక్టోబర్ 3 వరకు చిదంబరం జ్యూడీషియల్ కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీ ప్రత్యేక కోర్టు తీర్పు నిచ్చింది. దీంతో చిదంబరంను తీహార్ జైలుకు తరలించింది. అయితే బెయిల్ కోసం పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ప్రత్యేక కోర్టు చిదంబరంకు బెయిల్ మంజూరు చేయలేదు.