న్యూఢిల్లీ: రానున్న పక్షం రోజుల్లో సుప్రీం కోర్టు కొన్ని కీలకమైన కేసులలో తీర్పు వెలువరించనున్నది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ఈ నెల 17వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆయన నేతృత్వంలోని ధర్మాసనం పలు కీలక వ్యాజ్యాలకు సంబంధించి విచారణ పూర్తి చేసి తీర్పు వాయిదా వేసింది. ఈ కేసులన్నిటిలో అయన రిటైరయ్యే లోపు తీర్పు వస్తుంది. రామజన్మభూమి భ వివాదం సహా రఫేల్పై రివ్యూ పిటిషన్ వంటి కీలక కేసుల్లో తీర్పు వెలువడే అవకాశం ఉంది.
జస్టిస్ రంజన్ గొగొయ్ రామజన్మభూమి – బాబ్రీ మసీదు భూమి వివాదం వ్యవహారంలో 40 రోజుల పాటు సుప్రీం కోర్టులో రోజు వారి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబందించి సిఐజె నేతృత్వంలోని ధర్మాసనంలో వాదనలు పూర్తి కాగా గత నెల 16న తీర్పు రిజర్వు చేసింది. అదే విధంగా రఫేల్ యుద్ద విమానాల కొనుగోలుకు సంబంధించి గత ఏడాది డిసెంబర్ 14వ తేదీన సుప్రీం కోర్టు కేంద్రానికి క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే దీనిపై యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, ప్రశాంత్ భూషణ్ రివ్యూ
పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైనా వాద ప్రతిపాదనలు పూర్తి చేసిన సిజెఐ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. ఎన్నికలకు ముందు ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదిపై ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. రాహుల్ చేసిన వ్యాఖ్యలు న్యాయస్థానానికి ఆపాదించారనీ బిజెపి ఎంపి పిటిషన్ దాఖలు చేయడంతో రాహుల్ సుప్రీం ధర్మాసనానికి క్షమాపణ సైతం చెప్పారు. ఈ కేసులో ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్పైనా సిజెఐ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించాల్సి ఉంది. శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళల ప్రవేశించేందుకు అనుమతి ఇస్తూ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్పైనా సిజెఐ జస్టిస్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు పెండింగ్లో ఉంది.