చెన్నై: తిరుచ్చిలో ఉన్న లలితా జ్యూయలర్స్ బంగారం షాపులో దోపిడీ చేసిన దొంగలు.. పోలీస్ కుక్కల నుంచి తప్పించుకోవడానికి అక్కడ కారం చల్లారు. గత బుధవారం ఇద్దరు దొంగలు జంతువుల మాస్క్ పెట్టుకుని జ్యూయలరీ షోరూంలోకి దూరారు. రూ.13 కోట్ల విలువైన సుమారు 35 కేజీల బంగారం, వజ్రాభరణాలను దోచుకెళ్లారు. దొంగలు చోరీ తర్వాత దొంగలు బయటకు వెళ్తున్న దృశ్యాలు షాపు దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ ఫుటేజ్ ఆధారంగా దొంగల్ని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.
ఈ దోపిడీపై లలితా జ్యూయలర్స్ అధినేత కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏడు బృందాలను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకునేందుకు గాలిస్తున్నారు. గురువారం రాత్రి తిరువరూర్ లో ఓ నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడి నుంచి 4.5 కిలోల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సురేష్ అనే మరో నిందితుడు తప్పించుకున్నాడని చెప్పారు. దోపిడీ అనంతరం బంగారాన్ని నిందితులు పంచుకున్నట్లు తెలిపారు.
లలితా జ్యువెలరీ బంగారం షాపు మూడంతస్తుల భవనంలో ఉంటే.. గ్రౌండ్ ఫ్లోర్తోపాటు మొదటి అంతస్తులో ఉన్న నగలను దొంగలు దోచుకెళ్లారు. చోరీ చేసింది ఇద్దరుగా అనుమానాలు వ్యక్తమవుతుండగా.. మరి కొందరు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. తిరుచ్చి, పుదుకోట్టై, పెరంబలూర్, అరియలూర్, తంజావూర్ తదితర ప్రాంతాల్లోని లాడ్జీల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. పుదుక్కొట్టైలో ఓ హోటల్లో ఉన్న ఆరుగురు అనుమానితులను అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. ఐదుగురు హోటల్ రూంలో ఉండగా, ఓ వ్యక్తి పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేసి కిందపడ్డాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఐదుగురిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే, వారు బ్లాంకెట్లు అమ్ముకోవడానికి వచ్చామని చెప్పినట్టు తెలిసింది.
మరోవైపు నిందితులను పట్టుకునేందుకు ఏడు బృందాలను ఏర్పాటు చేసినట్లు తిరుచ్చి సిటీ పోలీస్ కమిషనర్ అమల్ రాజ్ తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ముఠానే ఈ దోపిడీకి పాల్పడినట్లు భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నామని, నిందితులను మరో రెండు రోజుల్లో పట్టుకుంటామని పోలీస్ కమిషనర్ అమల్ రాజ్ స్పష్టం చేశారు.
రెండు రోజుల క్రితం తమిళనాడులోని తిరుచ్చిలో లలితా జ్యువెలరీ షాప్కు కన్నం పెట్టిన ఇద్దరు దొంగలు పెద్ద మొత్తంలో నగలను ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. దొంగలు చోరీ చేసిన విధానం చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఓ భారీ గ్యాస్ కట్టర్ సాయంతో రెండు అడుగుల మందపాటి గోడను కట్ చేశారు. ముఖానికి జంతువుల మాస్క్లు తొడుక్కున్నారు. చేతులు, కాళ్లకు గ్లౌజ్ వేసుకున్నారు. పోలీస్ కుక్కల నుంచి తప్పించుకోవడానికి అక్కడ కారం చల్లారు. కారం పొడి చల్లడంతో కుక్కలు.. దొంగలు వెళ్లిన మార్గాన్ని గుర్తించలేవని అలా చేసినట్టు పోలీసులు తెలిపారు.