న్యూఢిల్లీ: వేతనజీవులు, పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. ఏడాదికి 5 లక్షల ఆదాయం ఉన్న వారికి ఎటువంటి పన్ను ఉండదని తెలిపారు. శనివారం లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె.. కొత్త ఆదాయం పన్ను విధానాన్ని వివరించారు. ఆదాయపన్ను శ్లాబులో భారీగా మార్పులు చేశారు. రూ.5 లక్షల లోపు ఆదాయంపై పన్నులో మార్పేమీ లేదు. గత పన్ను విధానాన్నే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రూ.0 నుంచి రూ.5లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. రూ. 5 లక్షల నుంచి రూ. 7.5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పది శాతం పన్ను విధించారు. రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయంపై 15 శాతం పన్ను, రూ.10 లక్షల నుంచి రూ.12.50 లక్షల ఆదాయంపై 20 శాతం పన్ను, రూ.12.50 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఆదాయంపై 25 శాతం పన్ను, రూ.15 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారిపై 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు.
గతంలో ఆదాయపన్ను శ్లాబ్లు ఇలా…
* రూ.5లక్షల నుంచి రూ7.5లక్షల వరకు 20శాతం
* రూ.7.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు 20 శాతం
* రూ.10లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు 30శాతం
* రూ.12.5లక్షల నుంచి రూ.15లక్షల వరకు 30శాతం
* రూ.15లక్షల కంటే ఎక్కువ ఆదాయం పొందే వారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉండేది.
బ్యాంకు డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవరేజిని రూ.5 లక్షల వరకు పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పన్ను చెల్లింపుదారులకు వేధింపులు ఉండవని స్పష్టం చేశారు. పన్ను ఎగవేతను క్రిమినల్ నేరంగా పరిగణించే విధానానికి స్వస్తి పలికే దిశగా చట్ట సవరణ చేస్తామని తెలిపారు. వ్యక్తిగతంగా పన్నులు చెల్లించే విధానం మరింత సరళతరం చేస్తున్నట్టు వెల్లడించారు. కొత్త విధానం ప్రకారం ఆదాయం ఎంతో వెల్లడించి ఈ మేరకు పన్ను చెల్లిస్తే చాలని వివరించారు.