బోయింగ్ విమానాలంటేనే అందరూ భయపడుతున్నారు. వాటిలో ఎక్కించాలంటే ప్రభుత్వాలు కూడా దడదడలాడుతున్నాయి. ముఖ్యంగా ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 మాక్స్ 8 విమానం కూలిపోయినప్పటి నుంచి ఈ భయం మరీ ఎక్కువైంది. విమానయాన సంస్థలన్నీ వెంటనే బోయింగ్ 737-8 తరహా విమానాలు నడపడం మానేయాలని చైనా ఆదేశించింది. స్వదేశంలో వివిధ ప్రాంతాలకు విమానాలు నడిపే సంస్థలకు ఈ ఆదేశాలు ఇచ్చింది.
మన దేశంలో కూడా బోయింగ్ 737 మాక్స్ విమానాలు నడిపిస్తున్న జెట్ ఎయిర్ వేస్, స్పైస్ జెట్ విమానయాన సంస్థల నుంచి డీజీసీఏ సమాచారం కోరింది. బోయింగ్ సంస్థను కూడా ఈ విమానాల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ రెండు చౌక విమానయాన సంస్థలు బోయింగ్ 737 మాక్స్ విమానాలను నడుపుతున్నాయి.
నైరోబి వెళ్లాల్సిన ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ బోయింగ్ 737 మాక్స్ 8 విమానం కుప్పకూలి అందులోని 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది అంతా మరణించిన విషయం తెలిసిందే. 2017 నుంచి తొలిసారి వాణిజ్య ప్రయాణాలను ఈ తరహా విమానాలు ప్రారంభించాయి. బోయింగ్ కంపెనీ దీన్ని చాలా మంచిదని చెబుతూ వచ్చింది. ఇంతకుముందు 2018 అక్టోబరు నెలలో కూడా ఇండోనేసియాకు చెందిన లయన్ ఎయిర్ విమానం జకార్తా నుంచి బయల్దేరి 13 నిమిషాల్లో కూలింది. అందులో ఉన్న 189 మంది మరణించారు.