పుల్వామా దాడిని మోదీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నదన్న ప్రతిపక్షాల విమర్శలకు తగినట్లుగానే ప్రధాని మోదీ, బుధవారం రాజస్థాన్లో మాట్లాడుతూ, దేశం ఇప్పుడు భద్ర హస్తాలలో ఉందని అన్నారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారత వైమానిక బలగాలు దాడులు చేసిన కొద్ది గంటల అనంతరం ఆయన చురులో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, ‘నేను ఈ దేశాన్ని తలదించుకోనివ్వను. మాతృభూమికి ఇది నా వాగ్దానం. మీ పరువుప్రతిష్టలు నేను కాపాడతాను’, అన్నారు.
ఈ ఉదయం ఇండియా వాయుసేన విమానాలు సరిహద్దు దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలో జైషె మొహమ్మద్ శిబిరంపై జరిపిన మెరుపుదాడులలో దాదాపు 300 మంది టెరరిస్టులు మరణించారు. జైషె మొహమ్మద్ అధినేత మసూద్ అజర్ బావ, ఐసి 814 ఎయిర్ ఇండియా విమానం హైజాకర్ అయిన యూసఫ్ అజర్ కూడా మృతులలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
తెల్లవారుజామున మూడున్నర గంటలకు ఈ ‘నాన్ మిలటరీ, ముందస్తు’ దాడులు జరిగాయి. పుల్వామా సంఘటన తరువాత భారత భూభాగంపై మరిన్ని దాడులకు జైషె మొహమ్మద్ తలపెట్టినట్లు సమాచారం ఉందనీ, అందుకే ముందస్తు దాడులు జరిపామనీ ప్రభుత్వం పేర్కొన్నది.
12 మిరేజ్ యుద్ధ విమానాలు వాస్తవాధీన రేఖ దాటి బాల్కోట్ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న జైషె మొహమ్మద్ శిక్షణా శిబిరంపై వెయ్యి కిలోల బాంబులు జారవిడిచాయి.