న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్తాన్ గగనతలంలో సంఘర్షించుకున్నాయి. పాక్ ఎఫ్16 జెట్ ఫైటర్ ఒకదానిని భారత వాయుసేన విమానాలు కూల్చివేసాయి. ఈ పోరులో ఇండియా ఒక మిగ్ ఫైటర్ విమానాన్ని కోల్పొయింది. దాని పైలట్ అభినందన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో శత్రు సేనలకు పట్టుబడ్డాడు. ఈ పరిణామాలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలోని పాక్ డిప్యూటీ హైకమిషనర్ను విదేశాంగశాఖ కార్యాలయానికి పిలిపించి వివరణ కోరింది.
పుల్వామా టెర్రర్ దాడికి ప్రతిగా మంగళవారం వేకువ జామున భారత వైమానికదళం విమానాలు పాకిస్తాన్, బాల్కోట్లోని జైషే మొహమ్మద్ శిక్షణా శిబిరంపై బాంబులు కురిపించాయి. దానికి ప్రతిగా బుధవారం పాక్ యుద్ధ విమానాలు భారత సైనిక స్ధావరాలపై దాడికి ప్రయత్నించాయి. దీనిని పసికట్టిన భారత వైమానికదళం సెకన్ల వ్యవధిలో జెట్ ఫైటర్స్ను గగనతంలంలోకి పంపించింది. ఆ పోరులో ఆవలి పక్షంలో ఎఫ్16, ఈవలి పక్షంలో మిగ్ విమానం కూలిపోయాయి. భారత్, పాక్ జెట్ ఫైటర్స్ గగనతలంలో తలపడడం కొన్ని దశాబ్దాల తర్వాత ఇదే ప్రధమం. రెండు దేశాల మధ్యా ఇంత తీవ్ర స్థాయిలో ఘర్షణ చెలరేగడం కూడా చాలాకాలం తర్వాత ఇదే మొదటిసారి.
భారత్ వైమానిక దాడికి తగిన జవాబు ఇస్తామని నిన్న ప్రకటించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేడు దిగివచ్చారు. పుల్వామా విషయంలోభారత్ ఆవేదనను అర్ధం చేసుకోగలమని అన్నారు. ఆ సంఘటనపై దర్యాప్తునకు సిద్ధమేనని ప్రకటించారు. యుద్ధం అంటూ వస్తే ఎవరి చేతిలోనూ కంట్రోల్ ఉండదంటూ, రెండు దేశాల ప్రభుత్వాలూ విజ్ఞతతో ఆలోచించి చర్చలకు దిగాలని ఆయన పిలుపునిచ్చారు.