ఈ శతాబ్దంలో ఇప్పటివరకూ అత్యంత ఘోరమైన పుల్వామా టెరరిస్టు దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. పొరుగు దేశమైన పాకిస్థాన్కు ఇచ్చిన అత్యంత అభిమానపాత్రమైన దేశం హోదాను శుక్రవారం రద్దు చేసింది. ఉదయమే ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశమై పరిస్థితిని సమీక్షించింది.
40 మంది కేంద్ర రిజర్వు పోలీసు జవానులను బలిగొన్న పుల్వామా దాడిపై దేశమంతటా తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ దాడిని తీవ్రంగా ఖండించడమే కాకుండా, ఈ విపత్కర సమయంలో కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడతామని ప్రకటించింది. పుల్వామా దాడి వెంటనే అమెరికా కూడా స్పందించింది. పాకిస్థాన్ భూభాగంలో నెలకొని ఉన్న అన్ని టెరరిస్టు స్థావరాలను వెంటనే మూసివేయించాలనీ, టెరరిస్టులకు సహాయ సహకారాలు అందించడం మానుకోవాలనీ ఆ దేశాన్ని హెచ్చరించింది.
క్యాబినెట్ కమిటీ సమావేశం తర్వాత మోదీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, అమర జవాన్ల త్యాగం వృధా కానివ్వబోమని పేర్కొ న్నారు. ఈ దాడితో తమకు ఏమాత్రం సంబంధం లేదని పాకిస్థాన్ పేర్కొన్నది. పుల్వామా దాడి చాలా ఆందోళనకరమైన సంఘటన అని పాక్ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఎలాంటి దర్యాప్తూ చేయకుండానే ఈ దాడితో పాకిస్థాన్కు సంబంధం ఉన్నట్లు ఇండియా మీడియా నుంచీ, ప్రభుత్వం నుంచీ వెలువడుతున్న వార్తలను ఖండిస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
పాకిస్థాన్పై ఇండియా తీవ్రమైన పదజాలంతో విమర్శలు చేసింది. జైషె మొహమ్మద్ నాయకుడు మసూద్ అజర్తో సహా పాక్ భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఇతర టెరరిస్టు నేతలను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం కింద టెరరిస్టులుగా ప్రకటించాలని భారత విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది.
మసూద్ అజర్ నాయకత్వంలోని జైషె మొహమ్మద్ సంస్థ పుల్వామా దాడికి పాల్పడిందనీ, పాకిస్థాన్ అండదండలతో ఈ టెరరిస్టు సంస్థ ఇష్టారాజ్యంగా దాడులకు పాల్పడుతోందనీ భారత్ విమర్శించింది.