న్యూఢిల్లీ: చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ క్రమంగా ఇతర దేశాలకు శరవేగంగా పాకుతోంది. ఈ నేపథ్యంలో చైనా నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని బీజింగ్ లోని భారత రాయబార కార్యాలయం నిర్ణయించుకుంది. అందులో భాగంగా చైనా పర్యాటకులకు తాత్కాలికంగా ఆన్ లైన్ వీసాలు జారీ చేయడం నిలిపివేస్తున్నట్టు ఆదివారం బీజింగ్ లోని భారత ఎంబసీ తెలిపింది. చైనా పాస్ పోర్టులు కలిగివున్న వారికి మాత్రమే కాకుండా, చైనా నుంచి భారత్ వచ్చే ఇతర దేశాల వారికి కూడా ఈ నిర్ణయం వర్తిస్తుందని భారత దౌత్యాధికారులు స్పష్టం చేశారు. అంతేకాదు, ఇప్పటికే ఎవరికైనా ఈ-వీసాలు జారీ చేసి ఉంటే, ఆ వీసాలు రద్దవుతాయని వెల్లడించారు. తప్పనిసరిగా భారత్ వెళ్లాల్సిన కారణాలు చూపిస్తే మాత్రం ప్రత్యేక అనుమతులతో చైనా ప్రయాణికులను భారత్ కు అనుమతిస్తామని తెలిపారు.
Advisory:
Due to certain current developments, travel to India on E-visas stands temporarily suspended with immediate effect. This applies to holders of Chinese passports and applicants of other nationalities residing in the People’s Republic of China.
— India in China (@EOIBeijing) February 2, 2020
మరోవైపు కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే మూడు వందల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 14,562 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఈ వైరస్ భారత్, అమెరికా, యూకేతోపాటు మొత్తం 25 దేశాలకు విస్తరించింది. చైనాలో నెలకొన్న ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో భారత్ వెళ్లేందుకు ఈ వీసాల మంజూరును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.