(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
న్యూజిలాండ్, వైట్ ఐలాండ్లో అగ్నిపర్వతం పేలిన సంఘటనలో గాయపడ్డ భారతీయ సంతతి అమెరికన్ డాక్టర్ ప్రతాప్ సింగ్ అలియాస్ పాల్ మరణించారు. ఇదే సంఘటనలో గాయపడ్డ ఆయన భార్య మయూరి అలియాస్ మేరీ డిసెంబర్ 22న కన్ను మూశారు.
టూరిస్టులు ఎక్కువగా సందర్శించే వఖారీ దీవిని వైట్ ఐలాండ్గా కూడా వ్యవహరిస్తారు. ఆ దీవిలోని అగ్నిపర్వతం గత డిసెంబర్ 9వ తేదీన పేలింది. ఆ అగ్నిపర్వతం విస్ఫోటనం అంతకు ముందు 2016లో సంభవించింది. తాజా విస్ఫోటనం సంభవించినపుడు చాలామంది టూరిస్టులు ఆ దీవిలోనే ఉన్నారు. వారిలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొందరు తీవ్రమైన కాలిన గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. చికిత్స పొందుతూ మరణించిన వారితో కలిపి ఇప్పటివరకూ మొత్తం 21 మంది కన్ను మూశారు.
విహార నౌక రాయల్ కరీబియన్ క్రూజ్ షిప్లో పర్యటిస్తున్న ప్రతాప్ సింగ్ కుటుంబంలో వారి ఇద్దరు పిల్లలు, మయూరి తల్లి దీవిలోకి వెళ్లకుండా నౌకలోనే ఉన్న కారణంగా వారి ప్రాణాలు దక్కాయి. లాభాపేక్ష లేకుండా వైద్య సేవలు అందించే సేవా ఇంటర్నేషనల్ సంస్థ అట్లాంటా విభాగానికి ప్రతాప్ సింగ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
వఖారి అగ్నిపర్వతం విస్పోటనం ప్రాణ నష్టానికి దారి తీయడంపై న్యూజిలాండ్ ప్రభుత్వం విచారణ జరుపుతున్నది. అగ్నిపర్వతం క్రియాశీలంగా మారిందని హెచ్చరిక జారీ అయినప్పటికీ టూరిస్టులను దీవిలోకి అనుమతించడంపై న్యూజిలాండ్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటున్నది.
Video Courtesy: The Guardian