భారతీయ జంట అరెస్టు.. కేసు నమోదు
సిక్కులు, కశ్మీరీలపై దంపతుల గూఢచర్యం
బెర్లిన్: జర్మనీలో ఉంటున్న సిక్కులు, కశ్మీరీల కదలికలపై నిఘా ఉంచారన్న ఆరోపణతో భారతీయ జంటను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. వారిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. మన్మోహన్ సింగ్ (50), ఆయన భార్య కన్వల్ జీత్ కౌర్ (51) ఇద్దరూ నిందితులని, వారు జర్మనీ వ్యక్తిగత రహస్యాల నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు అంటున్నారు.
జర్మనీలో ఉంటున్న సిక్కులు, కశ్మీరీలు, వాళ్ల బంధువులు ఏం చేస్తున్నారనే విషయాన్ని భారత విదేశీ నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా)కు అందజేస్తున్నట్లు మన్మోహన్ సింగ్ 2015 జనవరిలో అంగీకరించారని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. 2017 జూన్ నుంచి డిసెంబరు నెలల మధ్య భారతీయ నిఘా అధికారితో జరిగిన సమావేశాలలో అతడితో పాటు అతడి భార్య కూడా పాల్గొన్నారని, ఇలా చేసినందుకు ఆ జంటకు వారానికి రూ. 5.60 లక్షలు ఇచ్చారని ఆరోపించారు.
సాధారణంగా జర్మనీలో ఇలాటి తీవ్రమైన నేరాలకు పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది. మార్చి 28వ తేదీనే కేసు నమోదు చేశారు గానీ, ఫెడరల్ ప్రాసిక్యూషన్ సర్వీసు అధికారులు తాజాగా ఈ వివరాలు వెల్లడించారు.