న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్ లోని జైలులో శిక్ష అనుభవిస్తున్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ ను భారత అధికారి కలువనున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాలకు అనుగుణంగా భారత దౌత్యవేత్తలు ఆయన్ని కలిసేందుకు పాకిస్థాన్ అనుమతించింది. ఈ నేపథ్యంలో భారత్ కు చెందిన దౌత్య అధికారి గౌరవ్ అహ్లూవాలియా కుల్ భూషణ్ జాదవ్ తో సోమవారం భేటీ కానున్నారు. ఆయన ఇప్పటికే పాక్ విదేశాంగ కార్యాలయానికి చేరుకున్నారు. గత మూడు సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం లభించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ కోర్టు ఆదేశాలకనుగుణంగా పాకిస్థాన్ సానుకూల వాతావరణ కల్పిస్తోందని వెల్లడించాయి. జాదవ్ను కలిసేందుకు దౌత్యవేత్తలను అనుమతించాలని ఐసీజే ఈఏడాది జూలైలో పాక్ను ఆదేశించింది. షరతులతో అనుమతిస్తామని ముందు ప్రతిపాదించిన పాక్.. చివరికి ఇప్పుడు ఒప్పుకుంది.
భారత గూఢచార సంస్థ రా కోసం తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డాడంటూ కుల్ భూషణ్ ను 2016 మార్చి 3న పాకిస్థాన్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 2017లో పాక్ మిలిటరీ కోర్టు ఏకపక్ష విచారణ జరిపి కుల్ భూషణ్ కు మరణశిక్ష విధించింది. దీనిపై భారత్ నెదర్లాండ్స్ లోని హేగ్ లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేసింది. కుల్ భూషణ్ జాదవ్ కు పాకిస్థాన్ విధించిన మరణశిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం జూలై 17న సంచలన తీర్పు వెలువరించింది.