మెక్సికోలో పట్టుబడిన భారతీయుల్లో కొందరు
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ వారిందరిదీ ఒకటే కల. భూతల స్వర్గంగా అందరూ చెప్పుకునే అమెరికాలో కాలు మోపడం. కొత్త జీవితం మొదలుపెట్టడం. దాని కోసం చాలా సరిహద్దులు దాటారు. అనేక కష్టాలకోర్చి అడవుల్లో రోజుల తరబడి నడిచారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. చివరి సరిహద్దు దాటాల్సి ఉండగా పట్టుబడ్డారు. కల చెదిరిపోయింది. తిరిగి స్వదేశం రావాల్సివచ్చింది.
311 మంది భారతీయులు శుక్రవారం ఒక ఛార్టర్డ్ విమానంలో ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్నారు. మెక్సికో ప్రభుత్వం వారిని తిప్పి పంపింది. వారితో పాటు 74 మంది మెక్సికో వలస విభాగం అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది కూడా వచ్చారు. ఈ ప్రయాణం 36 గంటలు పట్టింది. మొదట మెక్సికో నుంచి స్పెయిన్, అక్కడ నుంచి ఢిల్లీ వచ్చారు.
మెక్సికోలో పట్టుబడిన భారతీయులను ఆ దేశ ప్రభుత్వం ఈ విమానంలోనే తిప్పి పంపింది
వెనక్కు వచ్చిన భారతీయుల్లో ఎక్కువ మంది పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారే. వారిలో ఒకరు మహిళ. దాదాపుగా వీరందరి ప్రయాణం ఈక్వెడార్లో మొదలయింది. కొలంబియా, పనామా, కోస్టారికా, నికరాగువా, హోండూరస్, గౌతమాలా గుండా ప్రయాణం సాగింది. చివరికి మెక్సికోలో పట్టుబడ్డారు. మెక్సికోలో వీరిని నెల రోజుల పైనే ఒక క్యాంప్లో నిర్బంధించారు. అక్కడ ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు.
వీరంతా ఈ ప్రయాణం కోసం లక్షలు ఖర్చు చేశారు. తిరిగి వచ్చిన వారిలో ఉన్న ఏకైక మహిళ కమలజిత్ కౌర్ తాను, భర్త, కొడుకు అమెరికా వెళ్లడం కోసం 53 లక్షలు ఖర్చు చేసింది. పంజాబ్లోని పాటియాలాకు చెందిన 19 ఏళ్ల మణిదీప్ సింగ్ సైన్యంలో చేరేందుకు రాసిన పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. దానితో అమెరికా వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. దానికోసం బ్రోకర్లకు 20 లక్షల వరకూ చెల్లించాడు. అమెరికా సరిహద్దుకు 800 కిలోమీటర్ల దూరంలో పట్టుబడ్డాడు.
తమ దేశంలో ఉండేందుకు కావాల్సిన అనుమతులు లేకుండా దొరికిన భారతీయులందరినీ టోలూకా నగరం నుంచి బోయింగ్ 747 విమానంలో ఢిల్లీ తిప్పి పంపినట్లు మెక్సికో వలస విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న తర్వాత అన్ని లాంఛనాలూ పూర్తి చేసి వారిని బయటకు పంపడానికి ఎనిమిది గంటలు పట్టింది.