హైదరాబాదు, ఏప్రిల్ 29: ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో జరిగిన తప్పులపై బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాల ఆధ్వర్యం చేపట్టిన ఆందోళనలు తీవ్రతరం అయ్యింది. ఇంటర్ ఫలితాల్లో తప్పులకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు ముట్టడి కార్యక్రమం చేపట్టారు. విద్యార్ధి సంఘాలు, కాంగ్రెస్, బిజెపి, టిడిపి, జనసేన నేతల ఆందోళనతో ఇంటర్ బోర్డు వద్ద వాతావరణం రణరంగంగా మారింది. ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
మరో పక్క ఇంటర్ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిని భర్తరఫ్ చేయాలని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ పార్టీ కార్యాలయం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ శిబిరాన్ని మాజీ ఎంపి బండారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ నాయకుడు మురళీధర్రావు, మాజీ మంత్రి డికె అరుణ తదితర నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు సందర్శించి సంఘీభావం తెలియజేస్తున్నారు.
కాగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి బయలుదేరిన విపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకులను ముందస్తు అరెస్టులు చేసినప్పటికీ ఇంటర్ బోర్డు ముట్టడికి పెద్ద ఎత్తున నాయకులు, విద్యార్థులు చేరుకుని నిరసన చేపట్టారు. తెలంగాణ జనసేన ఇన్చార్జి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు కూడా ముట్టడి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. కొందరు కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులు, పార్టీ నాయకులను అరెస్టు చేసి బలవంతంగా స్టేషన్కు తరలిస్తున్నారు. బోర్డు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఆందోళన కారణంగా నాంపల్లి రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇంటర్ బోర్డు వద్ద పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
హైదరాబాదు పాతబస్టీలో కాంగ్రెస్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన నివాసం వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. మేడ్చల్లో డిసిసి అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఇంటి వద్ద పోలీసులను మోహరించారు. ఇంటర్ బోర్డు ముట్టడికి పార్టీ నేతలతో వచ్చిన టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మరో టిడిపి నేత రావుల చంద్రశేఖరరెడ్డిని హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో అదుపులోకి తీసుకుని నారాయణగుడ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ నేతలు వి హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్యలను గృహ నిర్బంధం చేశారు.