హైదరాబాదు: తెలంగాణ జైళ్ల శాఖ డిజిగా పని చేసిన సీనియర్ ఐపిఎస్ అధికారి వికె సింగ్ రాజకీయ, పోలీస్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సెలవులో ఉండగా కెసిఆర్ ప్రభుత్వం ప్రింటింగ్,స్టేషనరీ, స్టోర్స్ కమిషనర్గా బదిలీ చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ, మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు.
పోలీస్ వ్యవస్థ వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగదని సింగ్ అన్నారు. రాజకీయాలతో బంగారు తెలంగాణా రాదని కూడా వికె సింగ్ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేకుండా ప్రజల కోసం పని చేస్తానని సింగ్ పేర్కొన్నారు. ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ కమిషనర్గా కొనసాగుతూ సాంఘిక సంక్షేమం కోసం పని చేస్తానని సింగ్ తెలిపారు.
జైళ్ల శాఖ డిజిగా పని చేసిన సమయంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని సింగ్ చెప్పారు. ఆనంద ఆశ్రమంతో 15 వేల మంది బిచ్చగాళ్లకు ఆశ్రయం ఇచ్చామనీ, ఇది తనకు చాలా ఆనందం కలిగించిన అంశమని సింగ్ పేర్కొన్నారు. జైళ్లలో అనేక నూతన మార్పులు తీసుకొచ్చామని సింగ్ తెలిపారు.
తాను సెలవులో ఉన్నప్పుడు స్టేషనరీ, ప్రింటింగ్, స్టోర్స్ కమిషనర్గా బదిలీ చేశారని సింగ్ అన్నారు. పదవుల కోసం తాను పని చేయడం లేదని సింగ్ పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థను మార్చడానికి తాను పోలీస్ శాఖకు రాలేదనీ, ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే వచ్చానని సింగ్ తెలిపారు. ఇప్పటి వరకూ తాను అనేక ప్రభుత్వ శాఖల్లో పని చేసినట్లు సింగ్ వెల్లడించారు. పోలీస్ వ్యవస్థ లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని సింగ్ అభిప్రాయపడ్డారు.
స్టేషనరీ, ప్రింటింగ్, స్టోర్స్ ప్రస్తుతం 50 కోట్ల రూపాయల అప్పు ఉందనీ, రెండు కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వస్తుందని సింగ్ తెలిపారు. తనను బదిలీ చేయడంతో చాలా మంది జైలు ఉద్యోగులు కూడా బాధపడ్డారని సింగ్ చెప్పారు.