కొత్తగా బయటపడిన చమురు నిక్షేపాల గురించి ప్రకటిస్తున్న ఇరాన్ అధ్యక్షుడు; Photo Courtesy: Reuters
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ఇరాన్లో మరో చమురు క్షేత్రం బయటపడింది. అందులో సుమారుగా 5300 కోట్ల బారెళ్ల చమురు నిక్షేపాలు ఉండవచ్చని అంచనా. దీనివల్ల ఇరాన్ చమురు నిక్షేపాలు మూడవ వంతు పెరుగుతాయి. ఈ చమురు క్షేత్రం దక్షిణ ఇరాన్లోని కుజెస్తాన్ రాష్ట్రంలో బయటపడింది.
ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ఆదివారం యాజ్ది నగరంలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, వైట్హౌస్కు చెబుతున్నాను, మీరు మా దేశంపై ఆంక్షలు విధిస్తే మా ఇంజినీర్లు, కార్మికులు కలిసి 5300 కోట్ల బారెళ్ల చమురు నిక్షేపాలు కనుగొన్నారు అని అన్నారు.
ఇరాన్పై కొన్నాళ్లుగా అమెరికా తీవ్రమైన ఆర్ధిక ఆంక్షలు అమలు చేస్తున్నది. ఫలితంగా ఇరాన్ తమ చమురును విదేశాలకు విక్రయించలేకపోతున్నది. 2015లో బరాక్ ఒబామా హయాంలో ఇరాన్తో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా బయటకువచ్చారు.
అప్పటినుంచీ ఆ ఒప్పందాన్ని కాపాడేందుకు దానిపై సంతకం పెట్టిన జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, చైనా వంటి ఇతర దేశాలు కృషి చేస్తున్నాయి కానీ ఇరాన్ చమురును అమ్మేందుకు మాత్రం దారి చూపలేకపోతున్నాయి. దరిమిలా ఇరాన్ అణుధార్మిక పదార్ధాల నిల్వలు పెంచుకుంటూపోతున్నది.
ప్రపంచంలో చమురు నిక్షేపాలు అత్యధికంగా ఉన్న దేశాలలో ఇరాన్ 15,000 కోట్ల బారెళ్లతో ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో ఉంది. సహజవాయువు నిక్షేపాలలో రెండవ స్థానంలో ఉంది. ఇప్పుడు బయటపడిన నిక్షేపాలు 2,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భూమి ఉపరితలానికి 80 మీటర్ల లోతులో ఉన్నట్లు తెలిసింది.