భారత దేశంలో ఆహార భద్రతా ప్రమాణాలు నిర్ణయించే భారత్ దేశ ఆహార భద్రత , ప్రమాణాల మండలి (Food Safety and Standards Authority of India) కి చెందిన ఇద్దరు సభ్యులు కోకా కోలా ఆర్ధిక సాయం పొందుతున్న ఒక సంస్థకి అనుబంధంగా ఉన్నారు. ఈ సంస్థ చైనా దేశంలో వినియోగదారులని మోసగించిన విషయం తెలిసిందే.
హార్వార్డ్ విశ్వవిద్యాలయం ఆచార్యులు సుసాన్ గ్రీన్హాల్ ప్రకారం చైనాలో పౌష్టికాహార శాస్త్రవేత్తలతో సంబంధాలు ఉన్న ఒక లాభాపేక్ష లేని సంస్థ ద్వారా “ప్రభుత్వ విధానాలు తన కార్పోరేట్ ప్రయోజనాలకి అనుగుణంగా ఉండే విధంగా” చైనాలో ఊబకాయానికి సంబంధించిన ప్రజారోగ్య విధానాలని కోకాకోలా సంస్థ బలహీనపరిచింది.
ఈ ఆందోళనకరమైన విషయాలు బ్రిటిష్ మెడికల్ జర్నల్ లోనూ అలాగే క్రితం నెలలో జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పాలసీ లోనూ ప్రచురితం అయ్యాయి.
ది ఇంటర్నేషనల్ లైఫ్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ ( ఐ.ఎల్.ఎస్.ఐ.) అనేది లాభాపేక్ష లేని సంస్థ. కోకాకోలా సంస్థ మాజీ ఉపాధ్యక్ష్యుడు అయిన అలెక్స్ మలాస్పిన దీనిని స్థాపించారు. కోకాకోలా సంస్థ ముఖ్య ఆరోగ్య మరియు వైజ్ఞానిక అధికారి అయిన రోనా ఆపిల్బామ్ 2015 చివరి వరకు దీనికి అధ్యక్షుడిగా ఉన్నారు.
గ్రీన్హాల్ పరిశోధన ప్రకారం కోకాకోలా మరియు ఇతర సంస్థలు ఐ.ఎల్.ఎస్.ఐ సంస్థ చైనా శాఖ ద్వారా చైనా ప్రజారోగ్య విధానాలని ప్రభావితం చేశాయి. “మనం చేసే పని మీదే కానీ మనం తీసుకునే ఆహరం మీద కాదు ఏదైనా ఆధారపడి ఉంటుంది” అనే సూత్రం వైపు మొగ్గు ఇందులో ముఖ్యమైనది. ఈ సూత్రం కోకాకోలాకు అనుకూలం. ఈ సూత్రాన్ని అతి కొద్ది మంది ప్రజారోగ్య నిపుణులు మాత్రమే అంగీకరిస్తారని గ్రీన్హాల్ అంటారు.
అభివృద్ధి చెందిన దేశాలలో ఊబకాయం వ్యాధి చక్కెర ఎక్కువగా తీసుకోవటం వల్లనే సంభవిస్తున్నది అని అనేక పరిశోధనలలో తేలటం వలన కోకాకోలా ఇరకాటంలో పడింది. ఊబకాయం అభివృద్ధి చెందుతున్న దేశాలైన చైనా, ఇండియా, మెక్సికో, దక్షిణ ఆఫ్రికాలలో కూడా పెరుగుతున్నది.
ఇలాంటి పరిస్థితుల్లో కోకాకోలా సంస్థ ఎంచుకున్న వ్యూహం ఏంటంటే ఊబకాయం-చక్కెర సంబంధం గురించి వస్తున్న పరిశోధన మీద ఎదురుదాడి చెయ్యటం. అంటే ఆహరం, కేలరీ వినియోగాల ప్రభావాన్ని తగ్గించి, శారీరక శ్రమ మాత్రమే సర్వరోగ నివారిణిగా ప్రచారంలో పెట్టడం.
అమెరికా దేశంలో గ్లోబల్ ఎనర్జీ బ్యాలన్స్ నెట్వర్క్(జి.ఈ.బి.ఎన్) అనే లాభాపేక్ష లేని మరొక సంస్థ కోకాకోలాకి అనుబంధ సంస్థగా ఉండటం మీద ప్రజారోగ్య కార్యకర్తలు, మీడియా నుండి ఒత్తిడి రావటంతో తన కార్యకలాపాలని మూసివేస్తున్నట్టు 2015లో ప్రకటించింది.
ఐ.ఎల్.ఎస్.ఐ లాగానే జి.ఈ.బి.ఎన్ కి కూడా కోకాకోలా నుండి ఆర్ధిక మద్దతు అందింది. దానిని స్థాపించడానికి అందిన 1.5 మిలియన్ డాలర్లు అందులో భాగమే. సాఫ్ట్ డ్రింక్స్ కి ఊబకాయానికి ఉన్న సంబధాన్ని మరుగు పరచడానికి ఈ సంస్థ ఆపిల్బామ్ తో కలిసి పనిచేసింది.
మొదట్లో కోకాకోలా, జి.ఈ.బి.ఎన్ సంస్థతో తమకి ఎటువంటి సంబంధం లేదు అని బుకాయించింది. కానీ కొద్ది రోజులలోనే అసోసియేటడ్ ప్రెస్ వారి ఇరువురికి మధ్య జరిగిన ఈ-మెయిల్ సంభాషణలని బహిర్గతం చేసింది. అది ఆపిల్బామ్ రాజీనామాకి దారితీసింది.
ఐ.ఎస్.ఐ.ఎల్ సంస్థకి భారత్ దేశ విభాగం కూడా ఉంది. ఆ సంస్థ కోశాధికారి కోకాకోలా సంస్థ భారతదేశ నియంత్రణ కార్యకలాపాల డైరక్టర్. ఆ సంస్థ బోర్డులో సభ్యులుగా నెస్లే, అజినోమోటో సంస్థ ప్రతినిధులు కూడా ఉన్నారు. కాబట్టి ఎటువంటి ఆశ్చర్యం కలగని విధంగా ఈ సంస్థ చక్కెర, ఆహారం పాత్రని మరుగునపరిచి, శారీరక శ్రమని ప్రోత్సహించే విధంగా సమావేశాలు నిర్వహించింది.
కానీ అన్నిటికన్నా బాగా ఆందోళన పరిచే విషయం ఏంటంటే ఇటువంటి ఆహార సంస్థలని నియంత్రించవలసిన ప్రభుత్వ అధికారులు ఐ.ఎల్.ఐ.ఎస్ సంస్థ కార్యక్రమాలలో భాగస్వాములుగా ఉండటం.
దేబబ్రత కానుంగో పైన పేర్కొన్న బోర్డులో ఒక సభ్యుడు. ఆయన భారత్ దేశ ఆహార భద్రత, ప్రమాణాల మండలిలో పురుగుమందు అవశేషాలు మీద ఏర్పరిచిన శాస్త్రీయ ప్యానెల్ సభ్యుడు. ఈ మండలి ఆహార భద్రత నిర్ధారించడానికి , భద్రతా ప్రమాణాలు నిర్ణయించడానికి ఏర్పాటు అయిన సంస్థ.
ఐ.ఎల్.ఐ.ఎస్ మరొక బోర్డు సభ్యుడు బి.శశికరణ్ ఆహార భద్రత, ప్రమాణాల మండలి వారు పౌష్టికాహార ఆహార ఉత్పత్తుల మీద ఏర్పరిచిన శాస్త్రీయ ప్యానెల్ సభ్యుడు.
శశికరణ్ వాషింగ్టన్ ప్రధాన కేంద్రంగా ఐ.ఎల్.ఐ.ఎస్ గ్లోబల్ సంస్థ బోర్డు సభ్యులలో ఒకరు కూడా. ఆయన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కింద పనిచేసే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కి అనుబంధంగా ఉన్నారు. ప్రభుత్వ అనుబంధ బోర్డు సభ్యుడు ఈయన ఒక్కరే.
పౌష్టికాహార శాస్త్రవేత్తలతో కలిసి ఐ.ఎల్.ఐ.ఎస్ సంస్థ చైనాలో ఎలా పనిచేసిందో భారతదేశంలో కూడా అలాగే ప్రజారోగ్య విధానాలని నియంత్రించడంలో సఫలీకృతం అయ్యింది.
2018 ఏప్రిల్ లో భారత్ దేశ ఆహార భద్రత, ప్రమాణాల మండలి ‘ఆహార భద్రత-ప్రమాణాల నిబంధనలు’ శీర్షికన ఒక ముసాయిదా విడుదల చేసింది. అందులో ఒక నిబంధన ఏంటంటే ఆహారంలో ఎక్కువ మోతాదులో కొవ్వులు, చక్కెర, ఉప్పు ఉంటే ఆ ఆహరం ప్యాకేజి మీద ఎర్ర రంగుతో లేబులింగ్ చెయ్యాలి అని. కోకాకోలా డబ్బా రంగు కూడా ఎరుపే.
భిన్న వర్గాల నుండి అభ్యంతరాలు రావటంతో ఈ నిబంధనలని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఈ “లేబులింగ్ విషయాన్ని మరొక్కసారి పరిశీలించటానికి” ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ అధ్యక్షుడు బి.శశికరణ్.
భారతదేశ ఆహార భద్రత నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తున్న వారెవరు కూడా ఐ.ఎల్.ఇస్.ఐ. సంస్థలో, ఆ మాటకొస్తే జంక్ ఫుడ్ అమ్మే సంస్థల అనుబంధ సంస్థలుగా ఉంటూ, వినియోగదారులని మోసపుచ్చటానికి ప్రయత్నిస్తున్న ఏ సంస్థలలోనూ పనిచెయ్యకుండా కట్టడి చెయ్యాల్సిన అవసరం ఉంది. అంతేకాక ఇలా రెండు విభిన్న పాత్రలు పోషించటం అనేది తీవ్ర విరుద్ధ ప్రయోజన వివాదంతో కూడుకున్నది. ఇటువంటివి అలా కొనసాగనిస్తే పౌష్టికాహారం, ఆహార భద్రత, ఊబకాయం మీద భారతదేశ విధానాలని ఆహార పరిశ్రమ నిర్దేశించే పరిస్థితి తలెత్తుతుంది.
కోకాకోలా లాంటి కంపెనీల దగ్గర భారీగా డబ్బు మూటలు ఉన్నాయి; కాబట్టి ఎంత ఖర్చుపెట్టడానికైనా వెనుకాడరు. 2006 సంవత్సరంలో స్థానికంగా నీటి ఎద్దడికి కోకాకోలా కంపెనీ కారణం అన్న వివాదం ఇండియాలో తలెత్తినపుడు, కోకాకోలా ఒక లాబీయిస్ట్ని నియమించింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం “ఈ లాబీయిస్టు చేసిన పని పర్యావరణ విధ్వంసానికి కోకాకోలాని కారణం చేస్తూ వచ్చే ప్రతి ప్రభుత్వ లేదా ప్రైవేటు అధ్యయనాన్ని సవాలు చేసే మరొక అధ్యయనం బయటకు తీసుకురావడం. ఇంకా మరికొన్ని పనులు”
భారత ప్రభుత్వం ఇటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉంటూ ఆహార పరిశ్రమలకూ, ప్రభుత్వ నియంత్రణ అధికారులకి ఉన్న దగ్గర సంబంధాలని చాలా తొందరగా తొలగించాల్సిన అవసరం ఉంది.
బి.శశికరణ్, దేబబ్రత కానుంగో ఇద్దరినీ భారత దేశ ఆహార భద్రత, ప్రమాణాల మండలి భాద్యతల నుండి తొలగించాలి. వారి స్థానంలో ఎటువంటి ప్రయోజన వివాదం లేని వారిని నియమించాలి.
ఈ రచయిత ఈ విషయం మీద భారత్ దేశ ఆహార భద్రత, ప్రమాణాల మండలి ముఖ్య కార్యనిర్వహణ అధికారి పవన్ అగర్వాల్కి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకి రాయటం జరిగింది. వారి నుండి వివరణ వచ్చిన వెంటనే ఇక్కడ ఆ విషయం కూడా ప్రచురిస్తాం.
అమిత్ శ్రీవాత్సవ్
-రచయిత కాలిఫోర్నియాలోని బర్క్లీ కేంద్రంగా కార్యకలపాలు నిర్వహించే
‘ఇండియా రిసోర్స్ సెంటర్ ఆన్ కార్పొరేట్ ఎక్కౌంటబిలిటీ ఇష్యూస్’ సంస్థలో పని చేస్తున్నారు.
‘ద వైర్.ఇన్’ వెబ్సైట్ సౌజన్యంతో