అమరావతి, ఏప్రిల్ 18: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కల్గించిన ఐటి గ్రిడ్స్ డేటా చోరీ కేసులో కొత్త ట్విస్ట్ దర్యాప్తు అధికారులకు మింగుడుపడని అంశంగా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన సేవా మిత్ర యాప్కు సేవలు అందిస్తున్న మాదావూర్లోని ఐటి గ్రిడ్స్ సంస్థ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ చేసిందంటూ తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు డేటా చోరీ కేసు దర్యాప్తును చేస్తోంది. సంస్థలోని రికార్డులను, కంప్యూటర్ హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకుంది. ఆ సంస్థ ఎండి అశోక్కి నోటీసులు కూడా జారీ చేసింది. ఎండి అశోక్ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేసింది.
ఐటి గ్రిడ్స్ సంస్థలో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన డేటా కూడా ఉందని రెండు రోజుల క్రితమే ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చింది. ఆ సంస్థపై కేసు నమోదు చేసిన సమయంలోనే ఆంధ్రప్రదేశ్కు చెందిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఇఒ) గోపాలకృష్ణ ద్వివేది తమ కార్యాలయం నుండి డేటా ఏమీ చోరీ జరగలేదనీ, ఓటర్ల జాబితా పబ్లిక్ డోమిన్లోనే ఉంటుందనీ, ఏవరైనా చూసుకునే అవకాశం ఉంటుందని వివరణ ఇచ్చారు.
తాజాగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడిఏఐ) దీనిపై స్పందించి తమ సర్వర్లలోకి చొరబడి ఆధార్ డేటా సేకరించారన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమనీ, దీనిపై ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. తమ సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపాజిటరీ ( సిఐడిఆర్) సర్వర్లు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని పేర్కొంది.
వ్యక్తులకు సంబంధించిన ఆధార్ సంఖ్య బయటకు తెలియడం వల్ల అతనికి ఎలాంటి ముప్పు ఉండదనీ, బయోమెట్రిక్ లేదా ఒన్టైమ్ పాస్వర్డ్ వంటి మరో అంచే రక్షణగా ఉంటుందని కూడా యూఐడిఏఐ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో డేటా చోరీ కేసు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.