(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి : ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ జరిపిన సోదాలలో రెండు వేల కోట్ల రూపాయలకుపైగా అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. దీనిపై ఐటీ శాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, కడప, ఢిల్లీ, పూణె సహా నలభై ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు ఐటీ శాఖ పేర్కొన్నది. ఏపీ, తెలంగాణలలో రెండు వేల కోట్ల రూపాయలకుపైగా అవకతవకలను గుర్తించామని వెల్లడించింది. మూడు ఇన్ ఫ్రా కంపెనీల్లో సోదాలు చేశామనీ, ఆయా కంపెనీల్లో నకిలీ బిల్లులు గుర్తించామనీ, ఈ సోదాల్లో కీలక పత్రాలు లభించాయనీ పేర్కొన్నది. లెక్కలు చూపని 85 లక్షల రూపాయల నగదు, 71 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు లభ్యమయ్యాయనీ వెల్లడించింది. పలువురికి చెందిన 25కు పైగా బ్యాంకు లాకర్లను సోదాల్లో గుర్తించినట్లు వివరించింది. ఏపీకి చెందిన ఓ ప్రముఖుడి మాజీ వ్యక్తిగత కార్యదర్శి నివాసంలోనూ తనిఖీలు చేశామని తమ ప్రకటనలో ఐటీ శాఖ వివరించింది.