గుంటూరు: అమరావతి పరిరక్షణ కమిటీ, పొలిటికల్ జేఏసీ జిల్లా వ్యాప్తంగా శనివారం తలపెట్టిన జిల్లా బంద్ను వాయిదా వేస్తున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ నుంచి రాజధాని అమరావతిపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఆందోళనలు ఆపమని స్పష్టం చేశారు. భవిష్యత్తు కార్యాచరణ జనవరి 3న ప్రకటిస్తామన్నారు. అప్పటి వరకు రిలే నిరాహార దీక్షలతో మండలాల వారీగా తమ నిరసనలు తెలియజేస్తామని తెలిపారు.
మరోవైపు రాజధాని అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వరుసగా 11వ రోజు రైతులు, రాజధాని ప్రజల నిరసనలు చేపట్టారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. 29 గ్రామాల రైతులు, ప్రజలు గత కొద్ది రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాజధానిని అమరావతిలో కొనసాగించేదాకా ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.