అమరావతి: కల సాకారమైన వేళ అటు వైఎస్ జగన్, ఇటు ఆయన తల్లి విజయమ్మ ఉద్వేగానికి లోనయ్యారు. గురువారం విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం స్వీకారం చేసి వెనక్కి తిరిగిన కుమారుడు జగన్ను ఆయన తల్లి ఉద్వేగంగా దగ్గరకు లాక్కుని హత్తుకుని నుదిటిపై ముద్దాడారు.
తొమ్మిది సంతవత్సరాల దీర్ఘకాలం ఎన్ని కష్టనష్టాలు ఎదురయినా వెరవక ఎదురీది తాను స్థాపించిన పార్టీని చివరకు 46 ఏళ్ల వయసులో అధికార ప్రాంగణంలో నిలిపిన జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి కాస్త నాటకీయత జోడించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణం చదివే సమయంలో ‘వైఎస్’ అని ఒక్క క్షణం ఆగి సభికుల వైపు చిరునవ్వుతో చూశారు. ఆయన ఆశించినట్లుగానే అభిమానుల కేరింతలతో సభాప్రాంగణం హోరెత్తింది. అదే క్రమంలో ‘ముఖ్యమంత్రిగా’ అని చదివి మరో క్షణం ఆగారు. మళ్లీ ప్రాంగణం దద్దరిల్లింది.
ప్రమాణ స్వీకారం అనంతరం ప్రసంగం సమయంలో జగన్ కూడా కాస్త ఉద్వేగానికి లోనయ్యారు. ఉచ్ఛస్వరంతో ప్రసంగించిన జగన్ చివరికి వచ్చేసరికి బొంగురు పోయిన గొంతుతో మాట్లాడారు. ప్రసంగం కూడా అట్లాగే ముగించారు.