(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిన్న సమావేశమై జరిపిన సుదీర్ఘ చర్చల సారాంశాన్ని పత్రికలు తలొక రకంగా రిపోర్టు చేశాయి. గోదావరి జలాలను కృష్ణానది బేసిన్కు తరలించే విషయమై మాత్రం అన్ని పత్రికలూ దుమ్ముగూడెం నుంచే అని రాశాయి.
ఒక్క ఈనాడు పత్రిక మాత్రం తెలుగు రాష్ట్రాలను కేంద్రం చిన్నచూపు చూస్తున్నదన్న విషయమై కెసిఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య చర్చ జరిగినట్లు రాసింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణం ప్రతిస్పందించింది. ఊహాజనిత కథనంగా ఈనాడు రాతను ఖండించింది. ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వెలువడిన ఒక ప్రకటనలో హితవు పలికారు.
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు తప్ప మరేమీ మాట్లాడుకోలేదనీ, వీరిరువురి మధ్యా గతంలో జరిగిన సమావేశాలు కానీ తాజా సమావేశం కానీ రాజకీయ అంశాలను దూరంగా పెట్టాయనీ ఆ ప్రకటనలో తెలిపారు. ఈ వార్తా కథనం రాయడంలో దురుద్దేశం ఉన్నట్లు కూడా కనబడుతోందని వ్యాఖ్యానించారు.
కెసిఆర్, జగన్ మధ్య జరిగే సమావేశం రెండు రాష్ట్రాల ప్రజలలోనూ ఆసక్తి కలిగిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. పోలవరం ఆనకట్ట ఎత్తు తగ్గించడానికి జగన్ అంగీకరించారనీ, దానిపై సమావేశంలో చర్చ జరుగుతుందనీ ఈ సమావేశానికి ముందు మీడియాలో వచ్చింది. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో సున్నితమైన విషయం కాబట్టి వార్తల కోసం జనం సహజంగానే ఆసక్తిగా ఎదురు చూశారు. గోదావరి- కృష్ణా నదుల అనుసంధానం రెండు రాష్ట్రాలకు ముఖ్యమైనదే. అయితే దీనిపై కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ చర్చ జరిగింది.
ప్రజలు ఈ వార్తల కోసం ఎదురుచూస్తుంటే ఈనాడు మాత్రం చర్చలలో చోటు చేసుకున్న రాజకీయ అంశం అంటూ కేంద్రం ధోరణిపై ఇద్దరు సిఎంలూ ఆగ్రహంగా ఉన్నట్లు రిపోర్టు చేసింది. నిజానికి ఇదేమంత విడ్డూరమైన విషయం కాదు. కేంద్రంలో ప్రభుత్వం నడుపుతున్న బిజెపి తెలంగాణలోని కెసిఆర్ సర్కారును వచ్చే ఎన్నికల్లో ఓడించి తాము గద్దె నెక్కాలని కోరుకుంటున్నది. ఆంధ్రప్రదేశ్లో కూడా టిడిపికి తామే ప్రత్యామ్నాయం కావాలని బిజిపి అనుకుంటున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రలనూ ఇబ్బంది పెట్టాలనే చూస్తుంది. దీనిపై ముఖ్యమంత్రులు ఇద్దరూ మాట్లాడుకోవడం చాలా సహజం.
అయితే ఈనాడు వార్తకు జగన్ ప్రభుత్వం స్పందించిన తీరు చూస్తే ఈ వార్త బిజెపి పెద్దల దృష్టికి వెళితే లేనిపోని తలనొప్పులు వస్తాయన్న భయం ఉన్నట్లు కనిపించింది. మంచి మెజారిటీతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్రాంతీయ పార్టీలు కూడా మోదీ – అమిత్ షా నాయకత్వంలోని బిజెపికి ఎలా భయపడతాయో దీనిని బట్టి తేటతెల్లం అవుతోంది. ముఖ్యమైన సమావేశాల తర్వాత ప్రభుత్వాలే వివరాలు వెల్లడిస్తే అసలు ఈ గొడవే ఉండదు.