సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలలో ఒకటి. ఒక దశలో హైకోర్టులో, మరో దశలో సుప్రీంకోర్టునూ దాని గురించే పోరాడుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలు, ఓ వర్గం తల్లిదండ్రులు ప్రతిపక్ష పార్టీలు ఎంతగా వద్దంటూ రచ్చ చేస్తున్నా సీఎం జగన్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ కోర్టుల వరకు వెళ్లారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం విధానాల్లో మార్పు మాత్రం సీఎం జగన్ కు ఒక రకమైన ఎదురు దెబ్బే. నిన్న సాయంత్రం కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆంగ్ల మాధ్యమంపై జగన్ నిర్ణయం ఎలా ఉండబోతోంది అనే సందేహం అందరిలోనూ నెలకొంది. కేంద్రం నూతనంగా ఇచ్చిన ఎడ్యుకేషన్ పాలసీలో ప్రాధమిక విద్యలో మాతృ భాషను తప్పనిసరి చేశారు. కానీ జగన్ నిర్ణయం మాత్రం ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి. ఈ రెండు పూర్తిగా భిన్నంగా ఉండడంతో సీఎం జగన్ నిర్ణయం అక్కడితో ఆగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆంగ్ల మాధ్యమంపై మరింత ముందుకు వెళ్లేందుకు జగన్ ఆలోచిస్తున్నారని అర్థమవుతోంది.
మంత్రి సురేష్ ఏమన్నారంటే…
- ఇంగ్లీష్ మీడియంపై సుప్రీం కోర్టులో ప్రభుత్వం వేసిన కేసును కొనసాగిస్తాం.
- ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్నాం.
- సీఎం జగన్ సహా మేమిచ్చిన పలు సూచనలను కేంద్రం ముసాయిదా బిల్లులో పొందుపరిచారు.
- బడికి పంపించే పిల్లల తల్లి దండ్రులకు ఏటా 15 వేలు ఇచ్చేలా ప్రవేశ పెట్టిన అమ్మఒడి పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కోరాం.
- దేశంలో ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీసు పెట్టాలని మేము కేంద్రానికి సూచించాం
- మేము సూచించిన కీలకమైన అంశాలను ముసాయిదా బిల్లులో కేంద్రం పొందుపరిచింది.
- రాష్ట్రంలో విద్యా వ్యవస్థను దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం.
- ఆగస్టు చివరి కల్లా రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుతుందని అంచనా వేస్తున్నాం.
- సెప్టెంబర్ 5న పాఠశాలలు తెరవాలని సీఎం ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు.
- పాఠశాలలు తెరిచే ముందు మరో సారి పరిస్థితిని సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటాం.