అమరావతి: అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ గత ప్రభుత్వ నిర్ణయాలను తిరగదోడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ విభాగంలో ఇంజినీరింగ్ పనులు నిలిపివేయాలని ఆయన శుక్రవారం ఆదేశించారు.
రాజధాని అమరావతి నిర్మాణంలో 25 శాతం లోపు పూర్తయిన పనులను ఆపివేస్తూ ఇప్పటికే జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అమరావతి నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుందనీ, దాని సంగతి ముందు తేల్చాలనీ ముఖ్యమంత్రి అంటున్నారు. మొన్న ప్రధాని మోదీని కలిసినపుడు కూడా అమరావతి నిర్మాణంలో అవినీతి నిగ్గు తేల్చేవరకూ దానికి నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయనకు చెప్పారు.
586.4 కోట్ల రూపాయల విలువైన ఇంజినీరింగ్ పనులు నిలిపివేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం విజయనగరం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలో 144 పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ పనులు నిలిచిపోనున్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్ ఒకటికి ముందు అనుమతి పొంది ఇప్పటి వరకు ప్రారంభించని పనులు నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పనులు ప్రారంభమైనా 25 శాతానికి మించని పనులపై సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు.