(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అవినీతికి తావులేని పాలన అందిస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు న్యాయ సమీక్షకు నిలబడటం లేదు. చంద్రబాబు నాయకత్వంలోని గత ప్రభుత్వం భారీ స్థాయిలో అవినీతికి పాల్పడిందని నిరూపించే దిశగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఉన్నత న్యాయస్థానాలు ఆ నిర్ణయాలను తిరగదోడడం అధికార పక్షమైన వైసిపికి ఇబ్బందికరంగా మారుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే దానిపై పోరాటానికి వీధుల్లోకి దిగిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి ఈ పరిణామాలు సంతోషం కలిగిస్తున్నాయి.
వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే మొదట విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై దృష్టి సారించారు. గత ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడి పునరుత్పాదక విద్యుత్ కొనుగోలుకు కొన్ని కంపెనీలకు ఎక్కువ ధరలు చెల్లిస్తున్నారన్నది జగన్ వాదన, ఆ కారణంగా వాటిని సమిక్షిస్తానంటూ పిపిఎలను రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినా వినలేదు. జపాన్ వంటి దేశాల దౌత్యాధికారులు ఆందోళన వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. పునరుత్పాదక విద్యుత్ తయారీ సంస్థల్లో చాలా విదేశీ పెట్టుబడులు ఉన్నాయి. ఆ కారణంగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ముఖ్యమంత్రి దేనినీ ఖాతరు చేయకుండా ముందుకు వెళ్లారు. చివరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిపిఎల సమీక్ష చెల్లదనీ, ప్రభుత్వానికి అధికారమే లేదనీ స్పష్టమైన తీర్పు చెప్పింది.
మరో పక్క పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ల రద్దు వ్యవహారం కూడా హైకోర్టు పరిశీలనలో ఉంది. తమ కాంట్రాక్ట్ రద్దును సవాల్ చేస్తూ నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కాంట్రాక్ట్ రద్దుపై స్టే ఇచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం రీటెండరింగ్ ప్రక్రియను ముందుకు నడిపింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఒక్కటే బిడ్ దాఖలు చేయడంతో నిబంధనలను సడలించి ఆ బిడ్ను ఖరారు చేసే పనిలో ఉంది.
అయితే హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులు అమలులో ఉండగా ప్రభుత్వం ఈ ప్రక్రియ ఎలా నడుపుతుందన్న ప్రశ్న ఉండనే ఉంది. నవయుగ సంస్థ హైకోర్టు ముందు ఈ ప్రశ్ననే లేవనెత్తింది. టెండర్ ప్రక్రియ ను ప్రారంభించడం ద్వారా ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడిందని నవయుగ వాదించింది. హైకోర్టు ప్రస్తుతం ఈ అంశాన్ని పరిశీలిస్తున్నది.
న్యాయ సమీక్షకు నిలబడని నిర్ణయాలతో ముందుకు వెళ్లడం వల్ల ప్రభుత్వం ప్రతిష్ట మసకబారుతోందన్న వాదన వైసిపి వర్గాలలోనే వినబడుతోంది. అయితే ఉన్నత స్థాయి ప్రభుత్వ పెద్దల స్థాయిలో ఈ పరిణామాలను ఎలా సమీక్షిస్తున్నదీ, ఏ విధమైన వైఖరి తీసుకుంటున్నదీ తెలియరావడం లేదు. ఈ పరిణామాలను సాక్షి మీడియా రిపోర్టు చేస్తున్న తీరు చూస్తే మాత్రం పునరాలోచన ధోరణి మొదలయినట్లు లేదు.