అమరావతి: వైసిపి అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఆపద్దర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్వయంగా ఫోన్ చేసి 30వ తేదీన తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ఆహ్వానించారు. ఆయన చంద్రబాబు ఆశీస్సులు కూడా కోరారు. ఈ పరిణామం టిడిపి వర్గాలను నివ్వెరపరిచింది.
ఒక్క ఫోన్ కాల్తో చంద్రబాబుపై జగన్ పైచేయి సాధించారని వైసిపి వర్గాలు అంటున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓడిన వారు గెలిచిన వారికి అభినందనలు చెప్పడం ఒక సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని దేశ రాజకీయాల్లో చాలావరకూ పాటిస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీకి అఖండ విజయం సాధించిపెట్టి, రాష్ట్రధికారం చేపట్టబోతున్న జగన్కు మాత్రం చంద్రబాబు ఫోన్ చేయలేదు. పత్రికా ప్రకటన ద్వారా మాత్రమే శుభాకాంక్షలు తెలిపారు. ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబితే బావుంటుందని ఒక ఉన్నతాధికారి చంద్రబాబుకు సూచించినా గానీ ఆయన మిన్నకుండిపోయినట్లు తెలిసింది.
ఇప్పుడు చంద్రబాబుకు జగన్ ఫోన్ చేయడం ద్వారా తనవైపు నుండి ఒక మంచి సందేశం ఇచ్చారు. మొన్న ఢిల్లీ పర్యటనలో మీడియాతో మాట్లాడినపుడు కూడా తనకు చంద్రబాబుతో వ్యక్తిగత వైరమేమీ లేదని జగన్ అన్నారు. చంద్రబాబు, జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమకాలీనులు. ఇద్దరూ ఒకేసారి కాంగ్రెస్ రాజకీయాల్లోకి వచ్చారు. 1983 నాటి టిడిపి విజయంతో ఇద్దరి దారులూ వేరయ్యాయి. అప్పటి నుంచీ వారిద్దరూ గట్టి రాజకీయ ప్రత్యర్ధులుగానే కొనసాగారు. 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయినపుడు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఆయనను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ వైఎస్ కుమారుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే చంద్రబాబు మళ్లీ ప్రతిపక్ష నేత పాత్ర పోషించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చంద్రబాబుకు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే. అందుకే శాసనసభలో ప్రతిపక్షనేత బాధ్యతలు పార్టీలో మరెవరికన్నా అప్పగించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.