అమరావతి: కృష్ణాజిల్లాలో గీతం యూనివర్శిటీకి కేటాయించిన భూములను రద్దు చేయాలని ఏపి కేబినెట్ నిర్ణయించింది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. టిడిపి ప్రభుత్వ హయాంలో జరిగిన భూమి కేటాయింపులను రద్దుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా విశాఖలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కోసం లులూ గ్రూపునకు కేటాయించిన 13.6 ఎకరాలు రద్దు చేసింది. జగ్గయ్యపేటలో గతంలో ఏపిఐఐసి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 498 ఎకరాల భూమిని రసాయన కర్మాగారం కోసం చంద్రబాబు వియ్యంకుడైన బాలకృష్ణ వియ్యంకుడికి కేటాయించగా దానిని మంత్రివర్గం రద్దు చేసింది.
గ్రామీణ నియోజకవర్గాల్లో అగ్రికల్చర్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలనీ, ఎరువులు ల్యాబ్లో పరీక్షించిన తరువాతే రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. రెట్టింపు పోషకాహారం అందించే పైలెట్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 77 మండలాల్లో 90 కోట్ల రూపాయలతో ఈ పథకం అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
అమ్మఒడి పథకం కింద ఏటా 15 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. కృష్ణా, గోదావరి కాలువల శుద్ధికోసం ఒక యంత్రాంగం ఏర్పాటుకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. టిటిడి మినహా దేవాలయాల్లో బోర్డు సభ్యుల నియామకం కోసం చట్టసవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.