(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఈ ఏడాది ముగియడానికి ఇంక ఎక్కువ రోజులు లేదు. 2019లో మన రాష్ట్రంలోని ప్రముఖులలో ఎవరి ప్రభ ఎంతో తెలుసుకోవాలని కుతూహలపడుతున్నారా. ఇయితే ఇదిగో చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి.
గూగుల్ ట్రెండ్స్ సమాచారం ప్రకారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జగన్ తర్వాతి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి నేత చంద్రబాబు నాయుడు ఉన్నారు. 2019 మొదటి ఆరు నెలల్లో జగన్కున్న పాపులారిటీ ఆ తర్వాత తగ్గింది. ఎన్నికల ముందు ప్రచారం, విజయం సాధించడం, తర్వాత ముఖ్యమంత్రి పదవి అలంకరించిన టైంలో జగన్ కోసం గూగుల్లో సెర్చ్ బాగా ఎక్కువ ఉంది. జూలై నెల నుంచీ ఆ పాపులారిటీ తగ్గింది. అయినా సంవత్సరం పొడవునా జగన్ పాపులారిటీకి ఎదురులేకుండా పోయింది. సెప్టెంబర్ మొదట్లో ఒక్కసారి మాత్రం పవన్ కళ్యాణ్ జగన్ కన్నా ముందుకు వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ తర్వాత జగన్ కోసం తమిళనాడు ప్రజలు ఎక్కువ సెర్చ్ చేశారు. అదే పవన్ కళ్యాణ్, చంద్రబాబు కోసం ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణలో ఎక్కువ సెర్చ్ చేశారు. నిరుత్సాహం కలిగించే విశేషం ఏమంటే ఈ ముగ్గురు నాయకుల విషయంలోనూ వారి ఉపన్యాసాలు, వ్యాఖ్యల కన్నా వారి పాటల కోసం ఎక్కువ సెర్చ్ జరిగింది. జగన్కు సంబంధించి రావాలి జగన్ కావాలి జగన్ పాట కోసం జరిగినంత సెర్చ్ మరే విషయంలోనూ జరగలేదు.
గత అయిదేళ్లూ చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ కోసం ఎక్కువ సెర్చ్ చేశారు. ఆయన తర్వాతి స్థానంలో చంద్రబాబు నిలిచారు. జగన్ కోసం సెర్చ్ 2018 ఆఖరులో పెరగడం మొదలుపెట్టింది. యుట్యూబ్లో గత ఆరు నెలల్లో పవన్ కళ్యాణ్కు సంబంధించిన కంటెంట్ ఎక్కువ చూశారు. తర్వాతి స్థానంలో జగన్ ఉన్నారు.
ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ప్రధానమైన సోషల్ మీడియా వేదికలు ఫేస్బుక్, ట్విట్టర్లో ఆయన పాపులారిటీ చెక్కు చెదరలేదు. ఆ రెండిటిలో ఇప్పటికీ ఆయనకే ఎక్కువమంది ఫాలోయర్లు ఉన్నారు. ట్విట్టర్లో చంద్రబాబుకు 44 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. దేశంలోనే ఎక్కువ మంది ట్విట్టర్ ఫాలోయర్లు ఉన్న నాయకులలో చంద్రబాబు ఒకరు. ఫేస్బుక్లో కూడా ఆయనకు 18 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఈ రెండు వేదికలూ కలిపితే పవన్ కళ్యాణ్కు 45 లక్షల మంది ఫాలోయర్లు, జగన్కు 30 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు.