(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ పేరు తెరపైకి వచ్చిన అనంతరం తొలిసారి నగరానికి వచ్చిన సీఎం జగన్ పర్యటన ఉత్తరాంధ్ర ప్రజలను నిరుత్సాహపరిచింది. విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా చేస్తారని, ఎన్నో ఆశలతో ఘన స్వాగతం పలికిన విశాఖ వాసులను సీఎం జగన్ నిరాశపరిచారు. విశాఖపట్నంలో జరిగిన ‘విశాఖ ఉత్సవ్’లో ఒక్క మాట కూడా మాట్లాడకుండానే వెనుదిరిగారు. దీంతో మూడు రాజధానుల ప్రకటనపై వైసీపీ ప్రభుత్వం పునరాలోచనలో పడిందా ? మూడు రాజధానుల ఏర్పాటు చేసేందుకు సాంకేతికంగా ఇబ్బందులు ఉన్నాయా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, సీఎం మాట్లాడకపోవడం వెనుక పలు కారణాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.
ఏపీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదనలు చేసిన అనంతరం తొలిసారి సీఎం వైఎస్ జగన్ శనివారం(డిసెంబర్ 28) తొలిసారిగా విశాఖపట్నం వెళ్లారు. విశాఖ విమానాశ్రయం నుంచి కైలాసగిరి, ఆర్కేబీచ్లోని విశాఖ ఉత్సవ్ వేదిక వరకూ దాదాపు 24 కిలోమీటర్ల మేర మానవహారం నిర్వహించి ముఖ్యమంత్రికి సాదరస్వాగతం పలికారు. విశాఖ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన జగన్.. ఆ తరువాత విశాఖ ఉత్సవ్ను ప్రారంభించారు. అయితే, విశాఖ నగరంలో మూడు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం జగన్.. ఏ ఒక్క చోట ప్రసంగించలేదు. విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామన్న ప్రకటన నేపథ్యంలో ఇక్కడ జగన్ ప్రసంగిస్తారని కార్యక్రమానికి హాజరైనవారు ఆశించారు. అధికారికంగా ప్రకటించకపోయినా, పరోక్షంగా అయినా విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తున్నామనే ప్రకటన చేస్తారని అంతా ఎదురుచూశారు. అయితే, సీఎం ఏమీ మాట్లాడకపోవడంతో విశాఖవాసులు నిరుత్సాహపడ్డారు.
అయితే, వ్యూహాత్మకంగానే సీఎం జగన్ ఏమీ మాట్లాడలేదని తెలుస్తోంది. మూడు రాజధానుల ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతిస్తుంటే… అమరావతి ప్రాంత ప్రజలు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా వారు ఆందోళనను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయంపై కాస్త వెనక్కి తగ్గిన జగన్.. విశాఖ ఉత్సవ్లో ఏం మాట్లాడకుండా వెళ్లారని తెలుస్తోంది. అయితే, న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసుకొని.. త్వరలోనే మూడు రాజధానులపై స్పష్టమైన ప్రకటన ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు మూడు రాజధానుల అంశాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన తదితర పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే, దీనిపై అన్ని ప్రధాన పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రాజధానులు కొందరు నాయకులు స్వాగతిస్తుంటే.. మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇక ఈ అంశాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, దీనిపై కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా ఇప్పటి వరకు స్పందించ లేదు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నిధులు ఇస్తోందని, ఇప్పుడు మూడు రాజధానులు చేస్తే… కేంద్రం సాయం చేస్తుందా ? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. నిజానికి రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోని అంశం. అయితే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక లోటుతో ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం సహకారం తప్పనిసరి. దీంతో ఈ అంశంపై కేంద్రానికి సంప్రదించాలనే ఆలోచనలో జగన్ ఉన్నారని, అందుకే విశాఖలో ఎలాంటి ప్రకటన చేయలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ ఎటువంటి ప్రకటన చేయకపోవడానికి కారణం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితే అని అంటున్నారు. రాజధానిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అయినా.. రాజధాని లాంటి పెద్ద విషయాలలో అఖిల పక్షం నిర్వహించాల్సి ఉంటుంది. గతంలో అమరావతి విషయంలో కూడా చంద్రబాబు అదే చేశారు. అప్పుడు వైసీపీ సహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వైసీపీ మినహా వేరే ఏ పార్టీ ఈ విషయంలో మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా లేదు. అందుకే జగన్ వెనక్కి తగ్గారని అంటున్నారు. అంతేకాదు ఈ విషయంలో కేంద్రం నుండి కూడా సంకేతాలు వచ్చాయని త్వరలోనే అమిత్ షా ఏపీ పర్యటన ఉండచ్చనే సంకేతాలు రావడంతోనే జగన్ వెనక్కి తగ్గారనే వాదన వినిపిస్తోంది.