హైదరాబాద్: మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై ఆమె సొంత తమ్ముడు జగత్ విఖ్యాత్ కేసు పెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఓ భూమికి సంబంధించిన వివాదంలో తన ఇద్దరు అక్కలపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ఇద్దరు అక్కలు అఖిలప్రియ, మౌనికారెడ్డిల పాటు మరికొందర్ని ప్రతివాదులుగా చేర్చారు. రాష్ట్ర రాజకీయాల్లో పేరుపొందిన భూమా కుటుంబంలో ఆస్తి తగాదాలు రచ్చకెక్కడం చర్చనీయాంశమైంది.
హైదరాబాద్ శివారు ప్రాంతం మంచిరేవులలో మాజీ మంత్రి భూమా నాగిరెడ్డి భార్య శోభానాగిరెడ్డి పేరుపై వెయ్యి గజాల స్థలం ఉండేది. అయితే ఆ స్థలాన్ని 2014లో శోభానాగిరెడ్డి మరణం తర్వాత 2016లో భూమా నాగిరెడ్డి రూ.2 కోట్లకు విక్రయించారట. భూమిని విక్రయించే సమయంలో భూమా నాగిరెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు అఖిలప్రియారెడ్డి, మౌనికారెడ్డితో కూడా సంతకాలు చేయించారు. తనయుడు జగత్విఖ్యాత్రెడ్డి మైనర్ కావడంతో.. వేలిముద్ర వేయించారు. అది గడిచిన మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఆ భూమిలో తనకు వాటా కావాలంటూ జగత్ విఖ్యాత్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. భూమి అమ్మే సమయానికి తాను మైనర్నని.. తనకేమీ తెలియని వయసులో తండ్రితో పాటు అక్కలిద్దరూ భూమిని విక్రయించారని ఆరోపించారు. ఆ పత్రాలపై తనకు తెలియని వయసులో వేసిన వేలిముద్రలు ఎలా చెల్లుతాయని ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు న్యాయంగా తనకు రావాల్సిన వాటాను ఇప్పించాలని తన పిటిషన్ లో అభ్యర్థించారు. ఇద్దరు అక్కలతో పాటు భూమిని కొనుగోలు చేసిన వ్యక్తిని కూడా ప్రతివాదులుగా చేర్చారు.
మరోవైపు కోర్టు నోటీసులు రావడంతో.. ఆ భూమిని కొనుగోలు చేసిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం కొనుగోలు చేసిన భూమిపై ఇప్పుడు కోర్టుకు వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కర్నూలు జిల్లాలో భూమా కుటుంబానికి మంచి పేరుంది. భూమా నాగిరెడ్డి మరణానంతరం ఆ కుటుంబానికి భూమా అఖిలప్రియ పెద్దదిక్కుగా వ్యవహరిస్తోంది. అయితే, ఇప్పుడు సోదరిపైనే తమ్ముడు ఆస్తికోసం కోర్టుకెక్కాడు. అయితే, విచిత్రంగా అఖిలప్రియ ఉంటున్న ఇంట్లోనే విఖ్యాత్ రెడ్డి కూడా నివసిస్తున్నాడు.