తృణమూల్ మంత్రులకు చుక్కెదురు
కోల్ కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీని జై శ్రీరాం నినాదాలు మరోసారి ఇబ్బందిపెట్టాయి. ఈసారి ఈ ఘటన బారక్ పోర్ నియోజకవర్గంలోని కాంచ్రపర ప్రాతంలో జరిగింది. మమతా బెనర్జీ ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. అక్కడకు సుమారు 200 మీటర్ల దూరంలో భారీ సంఖ్యలో పోగయిన కార్యకర్తలు జై శ్రీరాం అంటూ నినాదాలు మొదలుపెట్టారు. పోలీసులు వారిని ఆపేందుకు ప్రయత్నించి, చివరకు లాఠీచార్జి చేసి చెదరగొట్టాల్సి వచ్చింది.
మంత్రులు జ్యోతిప్రియో మల్లిక్, తపోష్ రాయ్ ఆ ప్రాంతం నుంచి వెళ్తుండగా వారి కాన్వాయ్ ని అడ్డుకున్నారు. వాళ్లు వెళ్లిన తర్వాత బీజేపీ మద్దతుదారులు కాంచ్రపర రైల్వేస్టేషన్ లో 15 నిమిషాల పాటు రైల్ రోకో నిర్వహించారు. తర్వాత సాయంత్రం 4 గంటల సమయంలో బీజేపీ కార్యకర్తలు జగద్దల్ పోలీసు స్టేషన్ వెలుపల ధర్నాకు దిగారు. సీఎం మమతా బెనర్జీ గురువారం భట్పర ప్రాంతం మీదుగా వెళ్తుండగా కొందరు వ్యక్తులు ‘జై శ్రీరాం’ అని నినదించడంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కారు నుంచి దిగి వారిని హెచ్చరించారు. కానీ ఆమె కారులోకి వెళ్లగానే మళ్లీ నినాదాలు మొదలయ్యాయి. దాంతో ఆమె వాళ్లు నేరస్తులని, బయటివాళ్లని మండిపడ్డారు.
శుక్రవారం నాడు పోలీసులు చిన్న చిన్న నేరాలకు గాను 10 మంది యువకులను అరెస్టుచేశారు. కానీ, జై శ్రీరాం అన్నందుకే వారిని అరెస్టుచేశారని బీజేపీ ఆరోపించింది. దాంతో ఆ పోలీసు స్టేషన్ ఇన్ చార్జిని బదిలీ చేశారు. మే నెల ప్రారంభంలో మమతా బెనర్జీకి ఆరాంబాఘ్ ప్రాంతంలో జై శ్రీరాం నినాదాలతో స్వాగతం లభించింది. ఆమె వెంటనే కారు అద్దాలు దించి, డ్రైవరును కారు ఆపమన్నారు. కారు దిగి.. నినాదాలు చేసేవారిని వచ్చి తనతో మాట్లాడమన్నారు. కానీ వారు పారిపోయారు.
కాంచ్రపర అనేది తృణమూల్ మాజీనేత, ప్రస్తుత బీజేపీ నాయకుడు ముకుల్ రాయ్, ఆయన కొడుకు శుభ్రాంశు రాయ్ లకు గట్టి పట్టున్న ప్రాంతం. సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి బీజేపీ, టీఎంసీల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవి జరుగుతున్నాయి. గత వారం టీఎంసీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, 60 మంది కార్పొరేటర్లు బీజేపీలో చేరారు.