(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: చేసిన నేరాలకు శిక్ష అనుభవిస్తూ జైలు జీవితం గడుపుతున్న వారికి సంసార సుఖం హక్కు ఉంటుందా? వారిని కలిసి ఒక రాత్రి వారితో గడిపేందుకు జీవిత భాగస్వాములను జైళ్లలోకి అనుమతించవచ్చా?
ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు ముందు ఈ ప్రశ్నలు ఉన్నాయి. ఖైదీలకు సంసార సుఖం హక్కు ఉందంటూ, దానికోసం వారి జీవిత భాగస్వాములను జైలులోకి అనుమతించాలంటూ అమిత్ సహానీ అనే న్యాయవాది, సామాజిక కార్యకర్త ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నిబంధనలు అందుకు అంగీకరించవంటూ డైరక్టర్ జనరల్ (జైళ్లు) కౌంటర్ అఫిడవిట్లో పేర్కొన్నారు. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను పెరోల్పై, ఫర్లోపై విడుదల చేస్తారనీ, వారి సాంసారిక జీవనానికి ఇవి వీలు కల్పిస్తాయయనీ అందులో పేర్కొన్నారు.
శిక్ష అనుభవిస్తున్నప్పటికీ ఖైదీకీ, ఆ ఖైదీ జీవిత భాగస్వామికీ సంసార సుఖం పొందేందుకు హక్కు ఉంటుందనీ, దానిని ప్రాధమికహక్కుగా పరిగణించాలనీ పిటిషనర్ కోరారు. పెరోల్, ఫర్లో పై అప్పుడప్పుడూ బయటకు పంపడంతో పాటు క్రమం తప్పకుండా ఖైదీలను జైలులోనే కలిసేందుకు వారి కుటుంబసభ్యులకూ, బంధువులకూ, న్యాయవాదికీ అనుమతి మంజూరు చేస్తామనీ, తద్వారా ఖైదీల సామాజిక సంబంధాలకు ఢోకా ఉండదనీ జైళ్ల యంత్రాంగం పేర్కొన్నది.
జైళ్లలో ఖైదీలకు సంసారసుఖం అందినట్లయితే నేరాలు తగ్గుతాయన్న పిటిషనర్ వాదనతో జైళ్ల అధికారులు ఏకీభవించలేదు. జైలులో ఖైదీలు జీవిత భాగస్వామిని విడిగా కలిసేందుకు వీలు కల్పించడం జైలు సదుపాయాల రీత్యా కూడా సాధ్యం కాదని జైళ్ల డైరక్టర్ జనరల్ పేర్కొన్నారు. ఉదాహరణకు తీహార్ జైలులో రోజుకు 1200 మంది ఖైదీలకు కుటుంబసభ్యులను కలిసే ములాఖాత్ ఉంటుంది. ప్రతిరోజూ అక్కడ అంతమందికి సంసారం హక్కు పొందే సదుపాయం కల్పించడం అసాధ్యం.