(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఒక ముస్లిం పురుషుడు ఒక హిందూ మహిళ కలిసి ఉండేందుకు తమ దగ్గర వీలులేదని రాజస్థాన్ రాజధాని జైపూర్లోని ఒక హోటల్ ఆ జంటకు వసతి నిరాకరించింది. శనివారం ఉదయం ఈ సంఘటన జరిగినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ దినపత్రిక రిపోర్టు చేసింది.
ఉదయపూర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న ఒక 31 ఏళ్ల ముస్లిం యువకుడు యాప్ ద్వారా జైపూర్లోని ఓయోస్ సిల్వర్కీ హోటల్లో ఇద్దరి కోసం గది బుక్ చేసుకున్నాడు. శనివారం ఉదయం అక్కడకు చేరుకున్నాడు. అతని స్నేహితురాలు ఢిల్లీ నుంచి ఇంకా చేరుకోలేదు. ఈలోపు హోటల్లో దిగాలనుకునేసరికి రిసెప్షనిస్టు గదిలో ఉండే రెండవ వ్యక్తి పేరు అడిగాడు. తన హిందూ ఫ్రెండ్ పేరు చెప్పగానే అలా అయితే రూం ఇవ్వడం కుదరదని రిసెప్షనిస్టు పేర్కొన్నాడు. అది చట్టాలకూ, రాజ్యాంగానికీ విరుద్ధమన్న ముస్లిం యువకుడి అభ్యంతరాలను పట్టించుకోలేదు.
భిన్నమతాలకు చెందిన జంటలకు రూం ఇవ్వవద్దని పోలీసుల నుంచి తమకు ఆదేశాలు ఉన్నాయని అతడు చెప్పాడు. ఆ విషయం రాతపూర్వకంగా ఇవ్వాలని అసిస్టెంట్ ప్రొఫెసర్ కోరాడు కానీ అతను నిరాకరించాడు. అప్పుడా ముస్లిం యువకుడు తాను హోటల్ బుక్ చేసిన యాప్ వారిని సంప్రదించాడు. వారు అతను కట్టిన డబ్బు రెట్టింపు చేసి వెనక్కి ఇచ్చారు. ఆపై మరో హోటల్లో ఉచితంగా రూం బుక్ చేశారు.
ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓయో హోటల్ మేనేజర్ను సంప్రదించగా పోలీసుల నుంచి తమకు లిఖితపూర్వక ఆదేశాలు ఉన్నాయిని అన్నాడు. ఆదేశాలను చూపించాలన్నపుడు నిరాకరించాడు. జైపూర్ పోలీసు కమిషనర్ ఆనంద్ శ్రీవాత్సవను సంప్రదించినపుడు, తాము ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేదని ఆయన చెప్పాడు.
అనంతరం ఓయో హోటల్ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. కష్టమర్కు అసౌకర్యం కలిగించిన ఆ మేనేజర్పై విచారణ చేస్తున్నామనీ, జరిగిన దానికి క్షమాపణ చెబుతున్నామనీ ఆ ప్రకటనలో తెలిపారు.