(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అయోధ్యలోని రామజమ్మభూమి- బాబ్రిమసీదు వివాదాస్పద స్థలంపై సుప్రీం కోర్టులో రివ్వూ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన చారిత్రాత్మక తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జమాతే ఉలేమా ఈ హింద్ అనే సంస్థ సోమవారం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. బాబ్రీ మసీదును హిందువులు కూల్చారని, అలాంటప్పుడు వారికే ఎలా తీర్పును అనుకూలంగా ఇస్తారని పిటిషన్లో ప్రశ్నించారు. సున్నీ వక్ఫ్ బోర్డు రివ్యూ పిటిషన్ వేయొద్దని నిర్ణయించిన నేపథ్యంలో జమాతే నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
పిటిషన్ వేయడంపై ఆ సంస్థ చీఫ్ మౌలానా అర్షద్ మదాని మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కువ శాతం మంది ముస్లీంలు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. కొందరు మాత్రమే సుప్రీం తీర్పును స్వాగతించారని, వారు మాత్రమే పిటిషన్ వద్దనుకుంటున్నారని పేర్కొన్నారు. రివ్యూ పిటిషన్ దాఖలు తమ హక్కు అని మౌలానా అర్షద్ మదాని అన్నారు. రామమందిరాన్ని కూల్చి మసీదు నిర్మించారనేది వివాదాస్పద అంశమన్నారు. ఆధారాలు లేవని కోర్టు తీర్పును వ్యతిరేకంగా ఇచ్చిందని పేర్కొన్నారు.
అయితే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన తొలి పిటిషన్ మాత్రం ఇదే. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కట్టవచ్చన్న తీర్పు నేపథ్యంలో కొన్ని ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయోధ్య తీర్పుపై 99 శాతం ముస్లింలు రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని కోరుకుంటున్నట్లు అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు పేర్కొంది. డిసెంబర్ 9న రివ్యూ పిటిషన్ వేస్తామని ఆ సంస్థ తెలిపింది. అయోధ్య తీర్పుపై సున్నీ వక్ఫ్ బోర్డు రివ్యూ పిటిషన్ వేయమని తేల్చిచెప్పింది.
ఇటీవలే అయోధ్య విషయంతో జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. మసీదు నిర్మాణం కోసం వేరే స్థలం కేటాయించాలి సుప్రీంకోర్టు తెలిపింది. వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రస్తకే లేదని స్పష్టం చేసింది. అయోధ్య యాక్ట్ కింద మూడు నెలల్లో మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలని, వివాదాస్పద స్థలాన్ని అయోధ్య ట్రస్ట్కు కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని తెలిపింది. 2.77 ఎకరాల భూమిని అయోధ్య ట్రస్ట్కు ఇచ్చి ప్రత్యామ్నాయంగా ఐదెకరాల భూమిని సున్నీ బోర్డుకు ఇవ్వాలని సూచించింది. బాబ్రీ మసీదును ఖచ్చితంగా ఎప్పుడు నిర్మించారో ప్రాతిపదిక లేదని సుప్రీం కోర్టు పేర్కొంది.