అమరావతి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ పాలనలో పారదర్శకత, దార్శనికత లోపించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. జగన్ వందరోజుల పాలనపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో రూపొందిన 33 పేజీల నివేదికను శనివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్నపలు విధానాలను పవన్ తప్పుబట్టారు.
సాధారణ రాజకీయ పార్టీ మాదిరిగా అధికారపక్షంపై ఎదో ఒక విమర్శ చేయాలన్నది జనసేన ఉద్దేశం కాదనీ, సంపూర్ణ అవగాహనతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వైసిపి వంద రోజుల పాలనపై నివేదిక తయారు చేశామని పవన్ చెప్పుకొచ్చారు.
వైసిపి మ్యానిఫెస్టో చూస్తే జనరంజకంగా ఉంది కానీ వారి పాలన జనహిత విరుద్ధమైనదిగా ఉందని పవన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో 151 స్థానాలతో గొప్ప మెజారిటీ దక్కింది కాబట్టి మంచి పాలన సాగిస్తారనుకున్నారనీ, ఇంత త్వరగా వైసిపి ప్రభుత్వంపై మాట్లాడే అవకాశం వస్తుందనుకోలేదనీ పవన్ అన్నారు.
రాజధాని అమరావతి నిర్మాణంలో 8218 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన తరువాత ఇప్పుడు మార్చేస్తామంటే వారిని ఏమనాలని పవన్ ప్రశ్నించారు. మంత్రి బొత్సా సత్యనారాయణ అమరావతి రాజధానిగా టిడిపి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదంటున్నారనీ, అది వారి అసమర్థతగా భావించి ఇప్పుడు వైసిపి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటనీ పవన్ ప్రశ్నించారు.రైతు కన్నీరు రాష్ట్రానికి క్షేమం కాదనీ, వారితో పెట్టుకుంటే అధఃపాతాళానికి వెళతారని పవన్ అన్నారు.
ఇసుక విధానంలో, పెట్టుబడులు ఆకర్షించడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని పవన్ విమర్శించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కూల్చేసిన అంశాల్లో ఇసుక మాఫియా ఒకటనీ, ఇసుక మాఫియా లేకుండా చేస్తామని అధికారంలోకి వచ్చి వైసిపి చేస్తున్నది ఏమిటని పవన్ ప్రశ్నించారు. మూడు నెలల వైసిపి పాలనలో ఇసుక కొరతతో లక్షలాది మంది ఉపాధి అవకాశాలు కోల్పోయారని అన్నారు. తాను ఇసుక డంపింగ్ యార్డ్ వద్దకు వెళ్లి వాస్తవ పరిస్థితులను కూడా తెలుసుకున్నానని పవన్ అన్నారు. వెబ్ సైట్లో టన్ను ఇసుకకు 375 రూపాయలు అని చెప్పి మరో 525 రూపాయలు సూపర్వైజర్ డంపింగ్ యార్డ్ వద్ద వసూలు చేస్తున్నారనీ, ఈ నగదు ప్రభుత్వానికి చేరుతుందో లేదో తెలియదని పవన్ అన్నారు.
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగే పరిస్థితులు కనబడటం లేదని పవన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా వారి మాటలు లెక్కచేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని పవన్ విమర్శించారు. పిపిఎల రద్దు, పోలవరం ప్రాజెక్టు పనులు రద్దు ఇలా గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు అన్ని రద్దు చేసుకుంటూ పోతే ఈ ప్రభుత్వంపై నమ్మకం పోతుందని పవన్ పేర్కొన్నారు. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను ఒక పార్టీతో చేసుకున్నట్లుగా భావించడం వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయని పవన్ అన్నారు.
అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ పెట్టి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఆ పరిశ్రమ సిఇఓను అక్కడి ప్రజాప్రతినిధి అవమానించారనీ, ఇలాంటి ఘటనలు జరిగితే ఎక్కడి నుండి పెట్టుబడిదారులు వస్తారని పవన్ ప్రశ్నించారు.విజయవాడలో 35 దేశాల రాయబారులతో సమావేశం పెట్టి ఏమి సాధించారని పవన్ ప్రశ్నించారు.
ప్రకాశం జిల్లాకు వచ్చే భారీ పరిశ్రమను వైసిపి ప్రభుత్వం కాపాడుకోలేకపోయిందనీ, దీంతో అది మహారాష్ట్రకు తరలివెళ్లిందని పవన్ అన్నారు. సింగపూర్లో వైసిపి ప్రభుత్వ ప్రతినిధి, మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే పెట్టుబడులను ఆకర్షించే విధంగా లేవని పవన్ అన్నారు. బందరు పోర్టు నిర్వహణ బాధ్యతలను తెలంగాణకు ఇస్తే దాని ఆదాయం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది గానీ ఆంధ్రప్రదేశ్కు వచ్చే ఉపయోగమేమిటని పవన్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి పాలకులు ధర్మకర్తలుగా భావించాలి కానీ యజమానులుగా భావించి ఇష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవడం మంచిపద్ధతి కాదని పవన్ హితవుపలికారు.
రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రాతిపదిక ఏమిటని పవన్ ప్రశ్నించారు. వైసిపి క్యాడర్ను రాబోయే ఎన్నికల్లో ఉపయోగించుకునేందుకు గ్రామాల్లో వాలంటీర్లుగా నియమిస్తున్నారని పవన్ విమర్శించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలకు చెడ్డపేరు వచ్చిందనీ, ఇప్పుడు వీరికి అదే పరిస్థితే వస్తుందని పవన్ అన్నారు.ప్రభుత్వానికి దూర దృష్టి లోపించిందని పవన్ విమర్శించారు.