అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ భారతీయ జనతా పార్టీతో దోస్తీ చేయాలని భావిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా కనబడటంతో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని జనసేనను పవన్ కళ్యాణ్ బిజెపిలో కలిపేస్తున్నారా అంటూ ప్రశ్నలు సంధించారు. దీనిపై పవన్ కళ్యాణ్ మళ్లీ క్లారిటీ ఇచ్చారు. తాను బిజెపితో ఎప్పుడూ దూరంగా లేననీ, రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేక హోదా విషయంలో మాత్రమే బిజెపిని విబేధించానని పేర్కొన్నారు. వైసిపి వాళ్లకు అమిత్ షా అంటే భయం, తనకు ఆయన నంటే గౌరవం అందుకే వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని పవన్ అన్నారు.
రాబోయే ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేసే అవకాశం ఉందా అన్న మీడియా ప్రశ్నకు పవన్ సమాధానం దాటవేశారు. తెలంగాణ సాధనలో అన్ని రాజకీయాలు ఒకే అంశంపై కలిసి పని చేశాయని గుర్తు చేశారు. అదే మాదిరిగా ఉత్తర ప్రదేశ్లో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా స్థాపించిన బహుజన సమాజ్ పార్టీ తరువాత కాలంలో బ్రాహ్మణుల సహకారం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఎక్కడైనా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా సమీకరణలు మారుతుంటాయని పవన్ పేర్కొనడం గమనార్హం.
ప్రస్తుత రాజకీయాలకు మోది, షా లాంటి వాళ్లే కరెక్ట్ అని పవన్ అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పవన్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల ఏ విధంగా ఉంటాయో వేచి చూడాలి.