అనకాపల్లి: కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసైనా కాంప్రిహెన్సివ్ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్) రద్దు చేయించి పాత పెన్షన్ విధానం అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో జరిగిన సభలో ప్రసంగించారు.
ఐఆర్ఎస్ అధికారిగా పని చేసిన చింతల పార్థసారధి లాంటి వారు పార్లమెంట్ సభ్యుడిగా గెలిపిస్తే ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్థావించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారనీ చెబుతూ అవంతి శ్రీనివాస్ లాంటి వారు పార్లమెంట్కు వెళ్లి కాళ్లుజాపి కూర్చోవడం తప్ప చేసేది ఏమీలేదని పవన్ ఎద్దేవా చేశారు. ఆయన ఎంపిగా ఉండి అనకాపల్లికి రైల్వే అండర్ పాస్ కూడా తీసుకురాలేకపోయారని పవన్ విమర్శించారు.
జనసేన అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ లాభాల బాట పట్టే విధంగా చర్యలు తీసుకుంటామని పవన్ హామీ ఇచ్చారు.
నేటి పాలకులు ప్రైవేటు వ్యక్తుల కోసం సహకార రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని పవన్ అన్నారు.
ప్రజా సమస్యలను పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకుంటాం,
‘రేషన్ బదులు నెలకు ప్రతి కుటుంబానికి రూ.2,500ల నుండి మూడువేల ఐదువందల వరకూ పంపిణీ చేస్తాం, డీలర్లకు ప్రత్యామ్నాయ చర్యలు చేపడతాం, చేనేత కార్మికులు, దివ్యాంగులను అన్ని విధాలుగా ఆదుకుంటాం, చిరువ్యాపారులకు పది వేల వరకూ పావలా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం, మహిళలకు ఏడాదికి పది సిలెండర్లు ఉచితంగా అందజేస్తాం’ అంటూ తదితర హామీలను పవన్ కళ్యాణ్ వివరించారు.
రాష్ట్రంలో వైసిపి సమర్థవంతమైన ప్రతిపక్షంగా పని చేయలేకపోయిందని పవన్ విమర్శించారు.
పెద్ద సంఖ్యలో నాయకులు, జనసైనికులు కార్యక్రమంలో పాల్గొన్నారు.